అతడి మాటలు ఎవరూ నమ్మొద్దు: డీకే శివకుమార్

కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి కలకలం రేపింది. తన మద్దతుదారుడైన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. ఇక్బాల్ హుస్సేన్ మాటలను ఎవరూ నమ్మవద్దని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం వ్యాఖ్యానించారు.

అంతకుముందు, ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ, జనవరి 6న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. "6, 9 తేదీలు డీకేకు అదృష్ట సంఖ్యలు. ఆయనకు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్‌పై అధిష్ఠానం సానుకూలంగా స్పందిస్తోంది. పార్టీ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉంటాం" అని ఆయన పేర్కొన్నారు. ఇక్బాల్ వ్యాఖ్యలకు మరో ఎమ్మెల్యే శివగంగ బసవరాజ్ కూడా మద్దతు పలికారు.

ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. నాయకత్వ మార్పు విషయంలో పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

నాయకత్వ మార్పుపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ నాయకత్వం పలుమార్లు హెచ్చరించినప్పటికీ, నేతలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. కాగా, తన బలాన్ని ప్రదర్శించేందుకు విందు సమావేశం ఏర్పాటు చేస్తున్నారన్న ప్రచారాన్ని కూడా డీకే శివకుమార్ కొట్టిపారేశారు. తన తరఫున ఎవరూ మాట్లాడవద్దని, పార్టీలో ముఖ్యమంత్రితో సహా 140 మంది ఎమ్మెల్యేలు ఒకే గ్రూప్ అని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News