కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ రసాభాస.. నిమిషాల్లోనే వెనుదిరగడంతో అభిమానుల ఆగ్రహం

  • పది నిమిషాల లోపే మైదానం వీడిన ఫుట్‌బాల్ స్టార్
  • వేలకు వేలు పెట్టి టికెట్లు కొని భంగపడ్డ అభిమానులు
  • నిరసనగా స్టేడియంలో బాటిళ్లు విసిరి, హోర్డింగుల ధ్వంసం
  • మిగతా కార్యక్రమాలు రద్దు చేసుకుని హైదరాబాద్‌కు పయనం
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని దగ్గర నుంచి చూద్దామని వేల రూపాయలు ఖర్చు చేసి వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కోల్‌కతాలోని వివేకానంద యువభారతి సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈవెంట్ తీవ్ర గందరగోళానికి, ఉద్రిక్తతకు దారితీసింది. తమ అభిమాన ఆటగాడు మైదానంలో కేవలం పది నిమిషాల లోపే కనిపించి వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు.

టికెట్ల కోసం రూ. 5,000 నుంచి రూ. 12,000 వరకు చెల్లించి, గంటల తరబడి ఎదురుచూసిన అభిమానులు.. మెస్సీ కాసేపటికే మైదానం వీడటంతో సహనం కోల్పోయారు. నిరసనగా స్టేడియంలోని స్టాండ్స్‌లో ఆందోళనకు దిగారు. కొందరు బాటిళ్లు విసరగా, మరికొందరు హోర్డింగులను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టాల్సి వచ్చింది.

ఈ ఘటనపై ఓ అభిమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. "నాయకులు, నటులు మాత్రమే మెస్సీ చుట్టూ ఉన్నారు. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారు? రూ.12,000 పెట్టి టికెట్ కొన్నాం, కానీ అతని ముఖం కూడా సరిగా చూడలేకపోయాం" అని వాపోయాడు. నిర్వాహకుల వైఫల్యం వల్లే ఇలా జరిగిందని, ఇది మోసం చేయడమేనని పలువురు ఆరోపించారు.

అంతకుముందు, మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా కోల్‌కతాకు చేరుకున్న మెస్సీకి ఘన స్వాగతం లభించింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, పశ్చిమ బెంగాల్ మంత్రి సుజిత్ బోస్‌తో కలిసి ఆయన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. అయితే, స్టేడియంలో జరిగిన గందరగోళం కారణంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరవ్ గంగూలీతో జరగాల్సిన సమావేశాలను మెస్సీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన ముందుగానే విమానాశ్రయానికి చేరుకుని, తన పర్యటనలో తదుపరి నగరమైన హైదరాబాద్‌కు బయలుదేరారు.


More Telugu News