ఆ తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా వస్తారు: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్య

  • కర్ణాటకలో మరోసారి ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ
  • శాసనసభ సమావేశాల అనంతరం శివకుమార్ సీఎంగా వస్తారన్న ఇక్బాల్ హుస్సేన్
  • పార్టీ కోసం ఆయన చేసిన కృషి ఆ స్థానంలో కూర్చోబెడుతుందని వ్యాఖ్య
శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని రామనగర కాంగ్రెస్ శాసనసభ్యుడు ఇక్బాల్ హుస్సేన్ పేర్కొనడం కర్ణాటక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బెళగావిలో కర్ణాటక శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ వ్యాఖ్యలు మరోసారి ముఖ్యమంత్రి మార్పు అంశానికి తెరలేపాయి.

"నేను మీకు ఒక శుభవార్త తెలియజేస్తున్నాను. ఈ సమావేశాల అనంతరం శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారు" అని ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివకుమార్‌కు ఆ అవకాశం ఉందని, ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. పార్టీ కోసం శివకుమార్ చేసిన పోరాటం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి ఆయనను ఆ స్థానంలో కూర్చోబెడతాయని ఇక్బాల్ హుస్సేన్ ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News