ఎన్నికల ప్రక్రియ, రిజర్వేషన్‌లలో జోక్యం చేసుకోలేం: తెలంగాణ హైకోర్టు

  • రిజర్వేషన్‌లపై దాఖలైన ఆరు పిటిషన్‌లపై విచారించిన హైకోర్టు
  • పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌లలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ
  • సంబంధిత కులానికి చెందిన వ్యక్తులు లేకపోతే ఎన్నికలు నిర్వహించబోమన్న ఎన్నికల సంఘం
తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్‌ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్‌లకు వ్యతిరేకంగా దాఖలైన ఆరు పిటిషన్‌లపై విచారణ జరిపిన హైకోర్టు, ఈరోజు తీర్పును వెలువరించింది.

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్‌లలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీ జనాభా లేని ప్రాంతాల్లో సైతం ఆయా కులాలకు వార్డు మెంబర్లు, సర్పంచ్ రిజర్వేషన్లు కేటాయించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లు కేటాయించడంలో పొరపాట్లు జరిగాయని వారు పేర్కొన్నారు.

రిజర్వేషన్లు కేటాయించిన చోట సంబంధిత కులాల వ్యక్తులు లేకపోతే ఎన్నికలు నిర్వహించబోమని ఎన్నికల సంఘం కోర్టుకు తెలియజేసింది. ఎన్నికల సంఘం చేసిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం పిటిషన్లపై విచారణను ముగించింది.


More Telugu News