దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్టుల్లో చెక్ ఇన్ సమస్య.. విమానాలు తీవ్ర ఆలస్యం

  • ఎయిర్ పోర్టుల్లోని కంప్యూటర్లలో మొరాయించిన మైక్రోసాఫ్ట్‌ విండోస్‌
  • విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికుల అవస్థలు
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రాకపోకలు ఆలస్యం
మైక్రోసాఫ్ట్ విండోస్ లో ఏర్పడిన సమస్య వల్ల దేశవ్యాప్తంగా విమానాల రాకపోకల్లో తీవ్ర ఆలస్యం చోటుచేసుకుంటోంది. ప్రయాణికుల చెక్ ఇన్ వ్యవస్థ మొరాయించడంతో విమానాలు ఆలస్యమవుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో దేశంలోని పలు విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దీంతో శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శంషాబాద్ లో పలు విమానాలు రద్దు..
శంషాబాద్ నుంచి ఢిల్లీ, మదురై, బెంగళూరు, గోవా, కోల్‌కతా, భువనేశ్వర్‌ వెళ్లాల్సిన 7 విమానాలను అధికారులు రద్దు చేశారు. అదేవిధంగా వివిధ నగరాల నుంచి శంషాబాద్‌కు రావాల్సిన 12 విమానాలు కూడా రద్దయినట్లు అధికారులు పేర్కొన్నారు. నిర్వహణ కారణాల వల్ల ఈ విమాన సర్వీసులు రద్దయినట్లు విమానయాన సంస్థలు వెల్లడించాయి.

విండోస్ సేవల్లో అంతరాయం వల్లే..
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ సేవలకు అంతరాయం కలిగిందని నిపుణులు తెలిపారు. దీంతో ఎయిర్‌పోర్టుల వద్ద ఐటీ సర్వీసులు, చెక్‌ ఇన్‌ వ్యవస్థలు పనిచేయడంలేదని వెల్లడించారు. దీంతో విమానాశ్రయాల్లో చెక్‌ ఇన్‌, బోర్డింగ్‌ ప్రక్రియలను ఎయిర్ పోర్ట్ సిబ్బంది మాన్యువల్‌ గా చేస్తున్నారు. దీనివల్ల విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ సమస్యపై మైక్రోసాఫ్ట్‌ సంస్థ కానీ, విమానయాన సంస్థలు కానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


More Telugu News