సిద్ధరామయ్య నివాసంలో బ్రేక్ ఫాస్ట్ చర్చ ఎందుకు జరిగిందంటే: డీకే శివకుమార్ కీలక వ్యాఖ్య
- మీడియా ఒత్తిడి కారణంగానే బ్రేక్ ఫాస్ట్ చర్చ జరిగిందని వెల్లడి
- సిద్ధరామయ్య, తాను సోదరుల్లా కలిసి పని చేస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి
- కర్ణాటక కాంగ్రెస్లో గ్రూప్లు అంటూ ఏవీ లేవని స్పష్టీకరణ
అధిష్ఠానం సూచనల మేరకు సిద్ధరామయ్య మూడు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రిని బ్రేక్ఫాస్ట్ చర్చకు ఆహ్వానించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్కు అవకాశం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి వర్గం కోరుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్, ప్రభుత్వంలో రెండు వర్గాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ఈరోజు స్పందించారు.
సిద్ధరామయ్య, తాను సోదరుల్లా కలిసి ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో లేదా ప్రభుత్వంలో సిద్ధరామయ్య గ్రూప్ లేదా డీకే శివకుమార్ గ్రూప్ అంటూ ఏమీ లేవని స్పష్టం చేశారు. మీడియా మాత్రం కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో గ్రూప్లు ఉన్నట్లు ప్రచారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ఒత్తిడి వల్లే తాము ఇటీవల బ్రేక్ఫాస్ట్ చర్చలు జరిపామని తెలిపారు.
"సిద్ధరామయ్య గ్రూప్, డీకే శివకుమార్ గ్రూప్, మరో గ్రూప్ అంటూ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన బ్రేక్ఫాస్ట్ చర్చల్లో పార్టీ గురించి మాట్లాడుకున్నాం. దీని గురించి మీడియా ఆలోచించకపోవడం మంచిది" అని డీకే శివకుమార్ అన్నారు.