కోహ్లీ, రోహిత్ ప్రపంచకప్ లో ఆడే అవకాశాలపై క్రికెట్ దిగ్గజం స్పందన

  • 2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడటం ఖాయమన్న కృష్ణమాచారి శ్రీకాంత్
  • ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టీకరణ
  • దక్షిణాఫ్రికాతో వన్డేలో సెంచరీతో కోహ్లీ, హాఫ్ సెంచరీతో రోహిత్ రాణించిన వైనం
  • వారి భాగస్వామ్యమే భారత్‌ను గెలిపించిందని శ్రీకాంత్ వ్యాఖ్యలు
  • ఫిట్‌నెస్‌పై వారికున్న శ్రద్ధ అద్భుతమని ప్రశంస
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కచ్చితంగా 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఈ ఇద్దరూ అద్భుత ప్రదర్శన చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ (135) అద్భుత సెంచరీ చేయగా, రోహిత్ (57) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

తన యూట్యూబ్ ఛానల్‌లో శ్రీకాంత్ మాట్లాడుతూ.. "రోహిత్, కోహ్లీ ఆటతీరు అద్భుతం. వాళ్లిద్దరూ లేకుండా 2027 ప్రపంచకప్ ప్రణాళికలు విజయవంతం కావు. వారిద్దరూ జట్టులో ఉండాల్సిందే. రాంచీ వన్డేలో వారి భాగస్వామ్యమే భారత్‌కు విజయాన్ని అందించింది. ఈ ఇద్దరూ కనీసం 20 ఓవర్లు క్రీజులో నిలిస్తే ప్రత్యర్థి జట్టుకు ఓటమి ఖాయం" అని విశ్లేషించారు.

"ప్రస్తుతం ఒక్క ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నప్పటికీ, వాళ్లు తమ ఫామ్, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం గొప్ప విషయం. పరుగులు చేయడంతో పాటు శారీరక దృఢత్వంపై కూడా దృష్టి పెడుతున్నారు. నా అభిప్రాయం ప్రకారం, 2027 వరల్డ్ కప్ కోసం ఓపెనర్, మూడో స్థానాలను వాళ్లిద్దరూ ఇప్పటికే ఖాయం చేసుకున్నారు. వాళ్లు లేకుండా మనం గెలవలేం" అని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

రాంచీ వన్డేలో రోహిత్-కోహ్లీ జోడీ రెండో వికెట్‌కు 136 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేయగా, ఛేదనలో దక్షిణాఫ్రికా గట్టిగా పోరాడి 332 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.


More Telugu News