దేనికీ తొందరపడను.. సోనియా గాంధీ కూడా పదవిని త్యాగం చేశారు: డీకే శివకుమార్

  • ముఖ్యమంత్రి అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
  • తనది ఏ వర్గమూ కాదని, కాంగ్రెస్ వర్గమన్న శివకుమార్
  • అన్ని వర్గాలను సమానంగా చూస్తానన్న డీ.కే.శివకుమార్
కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ నెలాఖరు లోగా పార్టీ అధిష్ఠానం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. "దేనికీ తొందరపడకూడదు. ముఖ్యమంత్రి అంశంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది" అని తాజాగా డీకే శివకుమార్ అన్నారు.

తనది ఏ వర్గమూ కాదని, కాంగ్రెస్ పార్టీయే తన వర్గమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను సమానంగా చూస్తానని చెప్పారు. తనకు ఏమీ వద్దని, దేనికీ తొందరపడబోనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోనియా గాంధీ అంశాన్ని ప్రస్తావించారు. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విజయం సాధించినప్పటికీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని సోనియా గాంధీ వదులుకున్నారని గుర్తు చేశారు. తనకు వచ్చిన అవకాశాన్ని మన్మోహన్ సింగ్‌కు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు, తమ మధ్య ఐక్యత ఉందని సూచిస్తూ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోను శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 'ఎక్స్'లో పోస్టు చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని నిన్న డీకే శివకుమార్ పోస్టు చేయగా, ప్రజలు ఐదేళ్లు పాలించేందుకు తీర్పు ఇచ్చారని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ వర్గాల్లో అయోమయం నెలకొంది.

DK Shivakumar
Siddaramaiah
Karnataka CM
Sonia Gandhi
Congress Party
Chief Minister

More Telugu News