హాంగ్‌కాంగ్‌లోని 35 అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది దుర్మరణం

  • ఎగసిపడిన మంటలు
  • వందలాది మందికి తాత్కాలిక ఆశ్రయాలను ఏర్పాటు చేసిన అధికారులు
  • సంఘటన స్థలానికి చేరుకున్న 128 అగ్నిమాపక వాహనాలు, 57 అంబులెన్సులు
హాంగ్‌కాంగ్‌లోని 35 అంతస్తుల హౌసింగ్ కాంప్లెక్స్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. సంఘటన స్థలంలోనే తొమ్మిది మంది మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన హౌసింగ్ కాంప్లెక్స్‌లోని వందలాది మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు.

థాయ్‌పో జిల్లాలోని ఆకాశహర్మ్యాల్లో బుధవారం మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాప్తి చెంది ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఆ నివాస సముదాయంలో సుమారు 2,000 ఇళ్లు ఉన్నాయని, అందులో కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని మీడియా కథనాలు వెల్లడించాయి.

ఈ ఘటనను 4వ నెంబరు ప్రమాదంగా అధికారులు ప్రకటించారు. అత్యయిక పరిస్థితి ప్రకటించినప్పుడు భారీస్థాయిలో ఫైరింజన్లు, సిబ్బందిని మోహరించవలసి ఉంటుంది. ఈ నివాస సమదాయంలో దాదాపు 4,800 మంది నివసిస్తున్నారు. 128 అగ్నిమాపక వాహనాలు, 57 అంబులెన్సులను ఘటనా స్థలానికి తరలించారు. మంటల్లో చిక్కుకున్న వారిలో వృద్ధులు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.


More Telugu News