కమలా పసంద్ అధినేత ఇంట్లో విషాదం.. కోడలు అనుమానాస్పద మృతి
- ప్రముఖ పాన్ మసాలా వ్యాపారి కమల్ కిశోర్ చౌరాసియా కోడలు మృతి
- ఢిల్లీలోని నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న దీప్తి చౌరాసియా
- తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్
- కుటుంబ సమస్యలే కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా
- శవపరీక్ష నివేదిక కోసం ఎదురుచూస్తున్న అధికారులు
వివరాల్లోకి వెళితే.. కమల్ కిశోర్ కుమారుడు హర్ప్రీత్తో దీప్తికి 2010లో వివాహం జరిగింది. వీరికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోని గదిలో చున్నీతో ఉరి వేసుకుని ఉన్న దీప్తిని ఆమె భర్త హర్ప్రీత్ గమనించారు. వెంటనే ఆమెను సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఘటనా స్థలంలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభించింది. "ఒక బంధంలో ప్రేమ, నమ్మకం లేనప్పుడు ఆ జీవితానికి అర్థం ఏముంటుంది?" అని ఆ లేఖలో రాసి ఉన్నట్లు సమాచారం. తన మృతికి ఎవరూ బాధ్యులు కాదని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ విషయంపై చౌరాసియా కుటుంబం గానీ, పోలీసులు గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాన్పూర్లో ఒక చిన్న దుకాణంతో పాన్ మసాలా వ్యాపారం ప్రారంభించిన కమల్ కిశోర్, ప్రస్తుతం వేల కోట్ల టర్నోవర్తో దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు.