ధోనీ బయోపిక్ లో 'అన్నయ్య' లేడు... కారణం ఇదే!
- ప్రపంచానికి తెలియని మహేంద్ర సింగ్ ధోనీ అన్నయ్య
- బయోపిక్లో కనిపించని నరేంద్ర సింగ్ ధోనీ పాత్ర
- సాధారణ జీవితం గడుపుతున్న సోదరుడు
- తన పాత్ర లేకపోవడంపై స్వయంగా క్లారిటీ ఇచ్చిన నరేంద్ర
- రోజు కూలీ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడి
పాన్ సింగ్ ధోనీ, దేవికా దేవి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు నరేంద్ర సింగ్ ధోనీ, కుమార్తె జయంతి, చిన్న కొడుకు మహేంద్ర సింగ్ ధోనీ. బయోపిక్లో ధోనీ సోదరి జయంతి పాత్రను నటి భూమిక పోషించారు. కానీ, ధోనీ కంటే పదేళ్లు పెద్దవాడైన అన్నయ్య నరేంద్ర సింగ్ పాత్రను సినిమాలో ఎక్కడా చూపించలేదు. ఈ కారణంగా, ధోనీ కుటుంబం అంటే తల్లిదండ్రులు, సోదరి, భార్యాబిడ్డలు మాత్రమే అని అందరూ భావిస్తుంటారు. ప్రస్తుతం ధోనీ సుమారు రూ.1,500 కోట్ల ఆస్తితో విలాసవంతమైన జీవితం గడుపుతుండగా, ఆయన సోదరుడు నరేంద్ర రాంచీలో చాలా సాధారణమైన జీవితం గడుపుతున్నాడు.
నరేంద్ర సింగ్ ధోనీ 2013లో సమాజ్వాదీ పార్టీలో చేరి రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ, ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, తన గెలుపు కోసం అతడు ఎప్పుడూ తన తమ్ముడి స్టార్డమ్ను వాడుకోవాలని ప్రయత్నించలేదు. అదేవిధంగా, ధోనీ కూడా తన అన్నయ్య తరఫున ప్రచారం చేయలేదు. ఇటీవల నరేంద్ర సింగ్ ధోనీ బతుకుతెరువు కోసం రోజు కూలీగా మారారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయింది. అయితే, ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. కుమావున్లో డిగ్రీ పూర్తి చేసిన నరేంద్ర, ప్రస్తుతం ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
తన పాత్ర బయోపిక్లో ఎందుకు లేదనే విషయంపై నరేంద్ర సింగ్ ధోనీ గతంలో స్వయంగా స్పష్టత ఇచ్చాడు. “నేను ధోనీ కంటే పదేళ్లు పెద్ద. మాహీ క్రికెట్ ఆడటం ప్రారంభించే సమయానికి నేను ఉన్నత చదువుల కోసం ఇంటికి దూరంగా ఉన్నాను. 1991 నుంచే నేను ఇంట్లో ఉండటం లేదు. రాంచీకి తిరిగి రావడానికి ముందు కుమావున్లో డిగ్రీ పూర్తి చేశాను. మాహీ ఎదుగుదలలో నా వంతు పాత్ర ఉంది. కానీ, నా పాత్రను సినిమాలో చూపించడం కథాగమనానికి అడ్డంకిగా మారుతుందని, కథ నిడివి కూడా పెరుగుతుందని దర్శకుడు భావించారు. అందుకే నా పాత్రను చేర్చలేదు. దాని గురించి నాకేమీ బాధ లేదు” అని అతడు వివరించాడు. ఈ వివరణతో లేనిపోని అపోహలకు తెరదించాడు.