ఈడెన్ పిచ్ వివాదం.. గంగూలీ సంచలన వ్యాఖ్యలు!

  • పిచ్ తయారీ బాధ్యత బీసీసీఐ క్యురేటర్లదేనని స్పష్టీకరణ
  • టీమ్ మేనేజ్‌మెంట్ కోరిక మేరకే పిచ్ సిద్ధమైందని వెల్లడి
  • కోచ్ గౌతమ్ గంభీర్‌ను తొలగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన గంగూలీ
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడం తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ పిచ్ వివాదంపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. పిచ్ తయారీలో తమ పాత్ర ఏమీ లేదని, మ్యాచ్‌కు నాలుగు రోజుల ముందే బీసీసీఐ క్యురేటర్లు దానిని తమ అధీనంలోకి తీసుకున్నారని స్పష్టం చేశాడు.

ఈ మ్యాచ్‌లో 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక భారత్ ఓటమి పాలైంది. పిచ్‌పై అనూహ్యమైన టర్న్, బౌన్స్ లభించడంతో ఇరు జట్ల బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ "పిచ్ తయారీలో నా ప్రమేయం ఏమాత్రం ఉండదు. టెస్టుకు నాలుగు రోజుల ముందే బీసీసీఐ క్యురేటర్లు వచ్చి పిచ్ బాధ్యతలు తీసుకుంటారు. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే వారు పిచ్‌ను సిద్ధం చేస్తారు" అని వివరించాడు.

అయితే, ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్ గొప్పగా ఏమీ లేదని గంగూలీ అంగీకరించాడు. "ఇది గొప్ప పిచ్ కాదని నేను ఒప్పుకోవాల్సిందే. భారత టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఇంతకంటే మెరుగైన పిచ్‌లపై ఆడేందుకు అర్హులు" అని ఆయన అభిప్రాయపడ్డాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోరిక మేరకే అలాంటి పిచ్‌ను రూపొందించినట్లు గంగూలీ తెలిపాడు. "మ్యాచ్ అనంతరం గంభీర్ స్వయంగా తానడిగిన పిచ్‌నే తయారు చేశారని చెప్పాడు. కెప్టెన్, కోచ్ కోరికలకు మేం విలువిస్తాం" అని గంగూలీ పేర్కొన్నాడు.

ఓటమి నేపథ్యంలో గంభీర్‌ను కోచ్‌ పదవి నుంచి తొలగించాలన్న వాదనలను గంగూలీ కొట్టిపారేశాడు. "గంభీర్‌ను తొలగించే ప్రసక్తే లేదు. ఇంగ్లండ్‌లో మంచి పిచ్‌లపై గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణించారు. వారిపై నమ్మకం ఉంచాలి" అని స్పష్టం చేశాడు. మంచి పిచ్‌లపైనే ఆడి 20 వికెట్లు తీయగల సత్తా భారత బౌలర్లకు ఉందని గంగూలీ విశ్వాసం వ్యక్తం చేశాడు.


More Telugu News