సచివాలయ వ్యవస్థ పటిష్టతకు కీలక అడుగు.. 19 మందికి జిల్లా అధికారులుగా పోస్టింగ్
- సచివాలయాల వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం కీలక నిర్ణయం
- 19 మంది అధికారులను జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు ఆఫీసర్లుగా నియామకం
- పంచాయతీ రాజ్ శాఖ నుంచి డిప్యూటేషన్పై అధికారుల బదిలీ
సచివాలయాల కోసం మూడంచెల పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ నియామకాలు జరిగాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఇటీవల పదోన్నతులు పొందిన 20 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల (సీఈవో) నుంచి 19 మంది సేవలను స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు విభాగానికి కేటాయించారు. వీరిని డిప్యూటేషన్ పద్ధతిపై వివిధ జిల్లాలకు డీఎస్జీఎస్డబ్ల్యూఓలుగా నియమించారు.
తూర్పు గోదావరి, నంద్యాల, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, ఏలూరు, అన్నమయ్య, కోనసీమ, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, ఎన్టీఆర్, కర్నూలు, శ్రీసత్యసాయి, కృష్ణా జిల్లాలకు కొత్త అధికారులను కేటాయించారు. పోస్టింగులు పొందిన అధికారులు తక్షణమే తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నియామకాల ద్వారా జిల్లా, మండల స్థాయిల్లో సచివాలయాల పనితీరు మరింత మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
.