ఐబొమ్మ రవి కేసులో ఈడీ రంగప్రవేశం... మనీలాండరింగ్ జరిగినట్టు అనుమానం

  • ఐ-బొమ్మ కేసు దర్యాప్తులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
  • మనీలాండరింగ్ కోణంలో విచారణకు ఈడీ సిద్ధం
  • బెట్టింగ్ యాప్స్, క్రిప్టో వాలెట్ల ద్వారా నిధుల సమీకరణ
  • నిందితుడి ఖాతాలోని రూ.3.5 కోట్లను ఇప్పటికే ఫ్రీజ్ చేసిన పోలీసులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ వెబ్‌సైట్ 'ఐ-బొమ్మ' కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ కేసులో భారీగా ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ, లోతైన దర్యాప్తు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తు నివేదికలను తమకు అందించాలని కోరుతూ ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. పోలీసుల నుంచి వివరాలు అందిన వెంటనే ఈడీ అధికారులు తమ విచారణను అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఐ-బొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల ద్వారా భారీగా నిధులు అందినట్లు గతంలో పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా, ఓ క్రిప్టో వాలెట్ నుంచి రవికి చెందిన ఎన్నారై ఖాతాకు ప్రతి నెలా రూ.15 లక్షలు బదిలీ అయినట్లు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే విదేశీ నిధుల ప్రవాహం, హవాలా లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది.

ఇప్పటికే పోలీసులు నిందితుడు రవికి చెందిన బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.3.5 కోట్లను ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో నిందితుడి బ్యాంకు ఖాతాల నిర్వహణ, నిధుల మళ్లింపుపై పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది. 


More Telugu News