ప్రింట్ మీడియాకు శుభవార్త చెప్పిన కేంద్రం

  • ప్రింట్ మీడియా ప్రకటనల రేట్లను 26% పెంచిన కేంద్రం
  • కలర్ యాడ్స్‌కు ప్రత్యేకంగా ప్రీమియం రేట్లు
  • ఆర్థిక స్థిరత్వం, నాణ్యమైన జర్నలిజం కోసం ఈ నిర్ణయం
  • చదరపు సెంటీమీటర్‌కు రూ. 47.40 నుంచి రూ. 59.68కి పెంపు
  • 9వ రేట్ స్ట్రక్చర్ కమిటీ సిఫార్సులకు కేంద్రం ఆమోదం
ప్రింట్ మీడియా రంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వార్తా పత్రికల్లో ప్రచురించే ప్రభుత్వ ప్రకటనల రేట్లను ఏకంగా 26 శాతం పెంచుతూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు, కలర్ ప్రకటనలకు ప్రత్యేకంగా ప్రీమియం రేట్లను కూడా ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయంతో పత్రికా రంగానికి ఆర్థికంగా చేయూత లభించనుంది.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, లక్ష కాపీలు ఉన్న దినపత్రికలకు బ్లాక్ అండ్ వైట్ ప్రకటనల రేటు చదరపు సెంటీమీటర్‌కు రూ. 47.40 నుంచి రూ. 59.68కి పెరిగింది. ఇతర మీడియా నుంచి వస్తున్న పోటీ, గత కొన్నేళ్లుగా పెరిగిన నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ నిర్ణయం వల్ల ప్రింట్ మీడియాకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని, తద్వారా నాణ్యమైన జర్నలిజం కొనసాగించడానికి, స్థానిక వార్తా సంస్థలకు మద్దతు ఇవ్వడానికి వీలవుతుందని కేంద్రం పేర్కొంది. మెరుగైన కంటెంట్‌పై పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రజా ప్రయోజనాలకు మరింత సమర్థవంతంగా సేవ చేయవచ్చని వివరించింది.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల ప్రచార కార్యక్రమాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) నిర్వహిస్తుంది. చివరిసారిగా 2019 జనవరిలో ప్రకటనల రేట్లను సవరించారు. తాజా సవరణ కోసం 2021 నవంబర్‌లో 9వ రేట్ స్ట్రక్చర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (INS) వంటి వివిధ వార్తాపత్రికల సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను, న్యూస్‌ప్రింట్ ధర, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని 2023 సెప్టెంబర్‌లో తన సిఫార్సులను సమర్పించింది. ఈ సిఫార్సుల ఆధారంగానే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.


More Telugu News