మహేశ్ బాబుపై పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్

  • ఈ కథకు మహేశ్ అర్హుడన్న పృథ్వీరాజ్
  • సినిమాలో విలన్ పాత్ర శారీరకంగా, మానసికంగా సవాల్ విసిరిందన్న పృథ్వీరాజ్
  • రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్
ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రానికి 'వారణాసి' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన టైటిల్ గ్లింప్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.. మహేశ్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు.
 
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ‘‘నేను చూసిన మొదటి తెలుగు సినిమా మహేశ్ ‘పోకిరి’. 'వారణాసి' కథకు, అందులోని పాత్రకు మహేశ్ బాబు అర్హుడు. రాజమౌళి గారు ఈ సినిమాలోని నా పాత్ర గురించి ఐదు నిమిషాలు చెప్పగానే వెంటనే అంగీకరించాను. ఆయన కథ చెప్పిన విధానానికి ఫిదా అయ్యాను. ఈ చిత్రంలో నా 'కుంభ' పాత్ర శారీరకంగా, మానసికంగా నాకు ఒక పెద్ద సవాల్‌గా నిలిచింది. షూటింగ్‌లో నేను నిజంగా టార్చర్ అనుభవించాను’’ అని నవ్వుతూ అన్నారు.
 
సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనదైన శైలిలో సినిమా విడుదలపై హింట్ ఇచ్చారు. ‘‘ఇటీవల మహేశ్ బాబు అభిమానుల గుండెల్లో ఓ కొత్త ఫ్లాట్ కొన్నాను. 2027లో గృహ ప్రవేశం’’ అంటూ సినిమా విడుదల తేదీని పరోక్షంగా వెల్లడించారు. కథానాయిక ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. ‘‘రాజమౌళి గారు ఒక విజనరీ డైరెక్టర్. భారతీయ సినిమాను ఆయన ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇలాంటి గొప్ప కళాకారులతో పనిచేసే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహేశ్ బాబు డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు.


More Telugu News