యూపీలో ఘోరం.. ఒకే ఇంట్లో ఐదు శవాలు
- భార్యాపిల్లల గొంతుకోసి ఉరి వేసుకున్న భర్త
- శ్రావస్తి జిల్లా కైలాశ్ పూర్ లో సంచలనం
- ఐదు రోజుల కిందటే ముంబై నుంచి గ్రామానికి వచ్చిన కుటుంబం
ఏం జరిగిందంటే..
గ్రామానికి చెందిన రోజ్ అలీ, షహనాజ్ దంపతులకు, ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. రోజ్ అలీ కుటుంబంతో కలిసి ముంబైలో ఉంటున్నాడు. సోదరికి పెళ్లి కుదరడంతో రోజ్ అలీ భార్యాపిల్లలతో కలిసి ఐదు రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం 8 గంటలు దాటుతున్నా రోజ్ అలీ కుటుంబం తలుపులు తెరవకపోవడంతో మిగతా కుటుంబ సభ్యులు తలుపు తట్టారు. అయినా ఉపయోగం లేకపోవడంతో గ్రామస్థుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు.
గది లోపల రోజ్ అలీ భార్యాపిల్లలు రక్తపు మడుగులో పడి ఉండగా.. అలీ ఉరివేసుకుని కన్పించాడు. కుటుంబంలో ఐదుగురూ చనిపోయారని గ్రామస్థులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులతో సహా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్యాపిల్లలను చంపేసి రోజ్ అలీ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వివరించారు. కుటుంబ కలహాల వల్లే రోజ్ అలీ ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.