ట్రంప్ వల్లే యుద్ధం ఆగింది.. మరోసారి ప్రశంసించిన పాక్ ప్రధాని
- ట్రంప్పై మరోసారి ప్రశంసలు కురిపించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
- మే నెలలో భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది ట్రంపేనని వ్యాఖ్య
- లక్షలాది మంది ప్రాణాలను ఆయన కాపాడారని కితాబు
తన ప్రసంగంలో షెహబాజ్ మాట్లాడుతూ ‘‘ట్రంప్ జోక్యంతో దక్షిణాసియాలో శాంతి పునరుద్ధరించబడింది. ఒక పెద్ద యుద్ధం నివారించబడింది, తద్వారా లక్షలాది మంది ప్రాణాలు నిలిచాయి’’ అని పేర్కొన్నారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల అనంతరం మే 10న ఇరు దేశాలు ‘పూర్తి, తక్షణ కాల్పుల విరమణ’కు అంగీకరించినట్లు ట్రంప్ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాకిస్థాన్ ఈ ఘనతను ట్రంప్కు ఆపాదిస్తుండగా, భారత్ మాత్రం ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో ఏ మూడో వ్యక్తి ప్రమేయం లేదని, నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిగిన అనంతరం ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఒక అవగాహనకు వచ్చాయని న్యూఢిల్లీ మొదటి నుంచి స్పష్టం చేస్తోంది.
ఇదే కార్యక్రమంలో షెహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. కరబాఖ్లో అజర్బైజాన్ సాధించిన విజయం ‘‘కశ్మీర్ వంటి అణచివేతకు గురైన అన్ని దేశాలకు ఆశాకిరణం’’ అని ఆయన అభివర్ణించారు. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటుందని, అయితే తమ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదని తేల్చిచెప్పారు.
ఈ విక్టరీ డే పరేడ్లో అజర్బైజాన్ సైనిక దళాలతో పాటు పాకిస్థాన్, తుర్కియే సైనికులు కూడా కవాతు నిర్వహించారు. పాకిస్థాన్కు చెందిన జేఎఫ్-17 థండర్ జెట్ల వైమానిక ప్రదర్శనతో ఈ కార్యక్రమం ముగిసింది.