Shashi Tharoor: కేసీఆర్ తనయుడు, కవిత మధ్య పోరు.. వారసత్వ రాజకీయాలపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

Shashi Tharoor comments on KCR son daughter political fight
  • వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు అన్న శశిథరూర్
  • తెలంగాణలో కేసీఆర్ తనయుడు, కవిత మధ్య వారసత్వ పోరు కొనసాగుతోందన్న థరూర్
  • వారసత్వ నాయకత్వంతో పాలనా నాణ్యత దెబ్బతింటుందని వ్యాఖ్య
వారసత్వ రాజకీయాల్లో ప్రతిభకు పట్టం కట్టాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ అభిప్రాయపడ్డారు. వారసత్వ రాజకీయాలు భారత ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కేసీఆర్ తనయుడు కేటీఆర్, కుమార్తె కవితల మధ్య వారసత్వ పోరు కొనసాగుతోందని ఒక వార్తా సంస్థ కథనంలో ఆయన పేర్కొన్నారు.

సామర్థ్యం, నిబద్ధత, క్షేత్రస్థాయిలో పనితీరు వంటి అంశాల ఆధారంగా కాకుండా వారసత్వం ద్వారా రాజకీయ అధికారాన్ని నిర్ణయిస్తే పరిపాలనా నాణ్యత దెబ్బతింటుందని ఆయన అన్నారు. అన్ని పార్టీలలోనూ కుటుంబ రాజకీయాలు సహజంగా కనిపిస్తుంటాయని శశిథరూర్ పేర్కొన్నారు. నెహ్రూ-గాంధీ వంశ ప్రభావం స్వాతంత్ర్య పోరాటంతో ముడిపడి ఉండటం వల్ల దశాబ్దాలుగా ఒకే కుటుంబం రాజకీయాలను శాసిస్తోందని అన్నారు.

రాజకీయ నాయకత్వం అనేది పుట్టుకతో వచ్చే హక్కు అనే భావనను ఇది స్థిరపరిచిందని ఆయన అన్నారు. ప్రతి పార్టీ, ప్రాంతం, స్థాయిలోనూ ఇది చొచ్చుకుపోయిందని అన్నారు. బిజూ పట్నాయక్-నవీన్ పట్నాయక్, బాల్ ఠాక్రే-ఆదిత్య ఠాక్రే, ములాయం సింగ్ యాదవ్-అఖిలేశ్ యాదవ్, ఫరూఖ్ అబ్దుల్లా-ఒమర్ అబ్దుల్లా, కరుణానిధి-ఎం.కె. స్టాలిన్-ఉదయనిధి వంటి ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగానే ఆయన కేసీఆర్ వారసుల అంశాన్ని ప్రస్తావించారు.

కుటుంబం అనేది ఒక బ్రాండ్‌గా ఉపయోగపడటం ఈ తరహా రాజకీయాలకు ఒక కారణం కావొచ్చని ఆయన అన్నారు. ఇంట్లో ఒకరికి గుర్తింపు లభిస్తే తదుపరి తరం అభ్యర్థులకు ఓటర్లను ఆకట్టుకోవడానికి, విశ్వాసాన్ని పెంచుకోవడానికి అంతగా కష్టపడాల్సిన అవసరం ఉండదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ప్రతిభను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.
Shashi Tharoor
KCR
KTR
Kalvakuntla Kavitha
Telangana politics
dynastic politics
Indian democracy

More Telugu News