దశాబ్దాల కల నెరవేరింది... భారత మహిళా క్రికెటర్లను కొనియాడిన సీఎం రేవంత్ రెడ్డి

  • ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025 గెలిచిన భారత జట్టు
  • టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
  • ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన భారత్
  • కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రశంసించిన సీఎం
  • దేశం గర్విస్తోందని వ్యాఖ్య
  • క్రీడాకారుల పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమన్న రేవంత్ రెడ్డి
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 ఫైనల్‌లో చారిత్రక విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరితమైన తుది పోరులో అద్భుత ప్రదర్శన కనబరిచి, ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కైవసం చేసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత క్రీడాకారిణులు ప్రదర్శించిన మొక్కవోని పట్టుదల, ధైర్యసాహసాలు, అంకితభావం ప్రశంసనీయమని కొనియాడారు. జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వ పటిమను, ఫైనల్‌లో జట్టు కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

"ఈ విజయంతో దశాబ్దాల కల నెరవేరింది. భారత మహిళా జట్టు సాధించిన ఈ అద్భుతమైన ఘనతకు యావత్ దేశం గర్విస్తోంది. మన క్రీడాకారిణులు ప్రదర్శించిన పోరాట పటిమ, క్రీడాస్ఫూర్తి దేశవ్యాప్తంగా వర్ధమాన క్రికెటర్లకు గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదే ఉత్సాహం, ఐక్యత, ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తులో మన జట్టు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు భారత మహిళల జట్టుకు, బీసీసీఐకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.


More Telugu News