విరాట్ కోహ్లీ 18వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగిన రిషబ్ పంత్

  • దక్షిణాఫ్రికా 'ఏ'తో అనధికారిక టెస్టు సిరీస్
  • భారత్ 'ఏ' జట్టు సారథిగా బరిలోకి దిగిన రిషబ్ పంత్
  • సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారిన పంత్ జెర్సీ
గాయం నుండి కోలుకున్న రిషబ్ పంత్ దక్షిణాఫ్రికా 'ఏ'తో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో పాల్గొంటున్నాడు. భారత్ 'ఏ' జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మైదానంలో ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో పంత్ ధరించిన జెర్సీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. రిషబ్ పంత్ 18వ నెంబర్ జెర్సీతో మైదానంలోకి అడుగు పెట్టాడు.

ఆ జెర్సీపై అందరి దృష్టి పడటానికి ప్రధాన కారణం అది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీది కావడమే. కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ జెర్సీని రిషబ్ పంత్ ధరించాడు. సాధారణంగా పంత్ జెర్సీ నెంబర్ 17. పంత్ ఈ జెర్సీని ధరించి రావడంతో సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. గతంలో ముఖేశ్ కుమార్ కూడా ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత 'ఏ' జట్టు తరఫున ఆడినప్పుడు 18వ నెంబర్ జెర్సీని ధరించాడు.

స్టార్ ఆటగాళ్లు ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వారి జెర్సీ నెంబర్లకు కూడా వీడ్కోలు పలకడం ఆనవాయితీగా వస్తోంది. సచిన్ టెండుల్కర్ (10), ఎంఎస్ ధోనీ (7) ఆటకు గుడ్‌బై చెప్పినప్పుడు బీసీసీఐ ఇదే విధంగా చేసింది. ఆ నెంబర్ల జెర్సీలను మరెవరూ ఉపయోగించకుండా నిర్ణయం తీసుకుంది. అయితే, కోహ్లీ విషయంలో ఇంకా అలాంటి నిర్ణయం తీసుకోలేదు. టెస్టుల్లో నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కోహ్లీ వన్డేల్లో కొనసాగుతున్నాడు. అందుబాటులో ఉన్న జెర్సీ నెంబర్ 18తో పంత్ బరిలోకి దిగి ఉంటాడని భావిస్తున్నారు.

Rishabh Pant
Virat Kohli
India A
South Africa A
Jersey Number 18
Rishabh Pant Jersey
Cricket
Bengaluru
Test Series
Mukesh Kumar

More Telugu News