రేపే ‘బాహుబలి: ది ఎపిక్‌’ విడుదల.. ఎడిటింగ్‌లో ఏయే సన్నివేశాలు తొలగించారో వెల్లడించిన రాజమౌళి

  • ఒకే భాగంగా రానున్న ‘బాహుబలి: ది ఎపిక్ వెర్షన్’
  • సినిమా చివర్లో బాహుబలి 3 ప్రకటన ఉంటుందని ప్రచారం
  • వదంతులను ఖండించిన దర్శకుడు రాజమౌళి
  • ఇంటర్వెల్‌లో స్పెషల్ 3D యానిమేషన్ టీజర్ ప్రదర్శన
  • కథనం వేగం కోసం కొన్ని సీన్లు, పాటలు తొలగించినట్లు వెల్లడి
తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన 'బాహుబలి' సిరీస్ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్ వెర్షన్' పేరుతో ఒకే సినిమాగా విడుదల చేస్తున్నారు. రేపు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రాత్రి నుంచి ప్రీమియర్లు పడనున్నాయి.

మరోవైపు, ఈ సినిమా చివర్లో 'బాహుబలి 3' గురించి ప్రకటన ఉంటుందంటూ కొద్ది రోజులుగా సాగిన ప్రచారానికి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ ప్రకటన లేనప్పటికీ, అభిమానులను థ్రిల్ చేసే ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను మాత్రం రివీల్ చేశారు.

'బాహుబలి: ది ఎపిక్ వెర్షన్' ప్రదర్శనలో ఇంటర్వెల్ సమయంలో ఒక ప్రత్యేక 3D యానిమేషన్ టీజర్‌ను ప్రదర్శించనున్నట్లు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఈ యానిమేషన్ సీక్వెన్స్ ద్వారా 'బాహుబలి' ప్రపంచాన్ని (యూనివర్స్‌ను) కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. ఇషాన్ శుక్లా అనే దర్శకుడు ఈ యానిమేషన్ టీజర్‌ను రూపొందించినట్లు చెప్పారు. దీంతో, నిర్మాత శోభు యార్లగడ్డ కొద్ది రోజుల క్రితం చెప్పిన 'సర్‌ప్రైజ్‌' ఇదేనని స్పష్టమైంది.

ఈ రాత్రి నుంచి 'బాహుబలి: ది ఎపిక్ వెర్షన్' ప్రీమియర్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో, 'బాహుబలి 3'పై సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను నిర్మాత శోభు యార్లగడ్డ ముందే ఖండించారు. 'బాహుబలి 3' ప్రాజెక్ట్‌కు ఇంకా చాలా సమయం పడుతుందని, ప్రస్తుత వెర్షన్‌లో అలాంటి ప్రకటన ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ఓ సర్‌ప్రైజ్‌ మాత్రం ఉంటుందని చెప్పి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు.

తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్, రానాలతో కలిసి రాజమౌళి పాల్గొన్న ఓ చిట్‌చాట్ వీడియోలో ఈ విషయాలను పంచుకున్నారు. కథనం వేగంగా, సూటిగా ఉండేందుకు 'ఎపిక్ వెర్షన్'లో అవంతిక లవ్ స్టోరీతో పాటు కొన్ని పాటలు, సన్నివేశాలను తొలగించినట్లు వివరించారు. అందరూ అనుకుంటున్నట్లు 'బాహుబలి 3' లేదని తేల్చిచెప్పారు. మొత్తం మీద, యానిమేషన్ రూపంలో బాహుబలి ప్రపంచం కొనసాగుతుందన్న వార్త అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.


More Telugu News