8వ తరగతి బాలికను కిడ్నాప్ చేసి వాహనంలో నలుగురి అఘాయిత్యం

  • ఫరీదాబాద్‌లో 15 ఏళ్ల బాలికపై దారుణం
  • మార్కెట్‌కు వెళ్లిన విద్యార్థినిని కిడ్నాప్ చేసిన నలుగురు యువకులు
  • కారులో తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
  • తెల్లవారుజామున ఇంటి దగ్గర వదిలేసి పరారీ
హర్యానాలోని ఫరీదాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికను నలుగురు యువకులు కారులో కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

పోలీసుల కథనం ప్రకారం.. 8వ తరగతి చదువుతున్న బాలిక ఈ నెల 26న సాయంత్రం 7 గంటల సమయంలో సెక్టార్ 18 మార్కెట్‌కు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది ఆమె కోసం గాలించారు. కానీ, ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు, తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిందితులు ఆమెను ఇంటి దగ్గర వదిలిపెట్టి వాహనంలో పరారయ్యారు.

ఉదయం 4:30 గంటలకు ఇంటికి చేరుకున్న బాలిక, తనకు జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో బాధితురాలి అక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. “సాయంత్రం నలుగురు యువకులు నన్ను కారులో కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు” అని తన చెల్లెలు చెప్పిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఈ ఫిర్యాదు ఆధారంగా ఫరీదాబాద్ ఓల్డ్ పోలీస్ స్టేషన్‌లో గుర్తుతెలియని నలుగురు యువకులపై భారతీయ న్యాయ సంహిత, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై స్టేషన్ హౌస్ ఆఫీసర్  విష్ణు మిత్తర్ మాట్లాడుతూ “బాధితురాలు ఇంకా వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేదు. మేము దర్యాప్తు చేస్తున్నాం. సెక్టార్ 18 మార్కెట్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తాం” అని తెలిపారు.


More Telugu News