ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సు దగ్ధం.. ఎయిరిండియా విమానం పక్కనే ఘటన

  • ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 వద్ద బస్సులో మంటలు
  • ప్రమాద సమయంలో బస్సులో లేని ప్రయాణికులు
  • సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. టెర్మినల్ 3 వద్ద ఎయిరిండియా విమానానికి కొన్ని మీటర్ల దూరంలో ఆగి ఉన్న ఓ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే, టెర్మినల్ 3 వద్ద బే 32 సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు పలు విమానయాన సంస్థలకు గ్రౌండ్ సర్వీసులు అందించే 'సాట్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్' అనే థర్డ్-పార్టీ సంస్థకు చెందినది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణికులు ఎవరూ లేరు. సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి, నిమిషాల వ్యవధిలోనే మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

ఈ ఘటనపై ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ యాజమాన్యం స్పందించింది. ఇదొక సాధారణ ఘటనేనని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని 'ఎక్స్' వేదికగా తెలిపింది. "ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే మా ప్రథమ ప్రాధాన్యత. విమాన సర్వీసులన్నీ యథాతథంగా కొనసాగుతున్నాయి" అని స్పష్టం చేసింది.

ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు గానీ, లగేజీ గానీ లేదని పోలీసులు తెలిపారు. అయితే, బస్సులో డ్రైవర్ మాత్రమే ఉన్నాడని, అతనికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సాట్స్ సంస్థ దర్యాప్తు ప్రారంభించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు బస్సును క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు పోలీసులు తెలిపారు.


More Telugu News