చైనాకు మరోసారి వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
- వ్యక్తిగతంగా తాను చైనాతో స్నేహ సంబంధాలే కోరుకుంటానని వ్యాఖ్య
- అయినప్పటికీ కఠినంగా ఉండాల్సి వస్తోందన్న అమెరికా అధ్యక్షుడు
- 155 శాతం టారిఫ్ ల అమలు తప్పేలా లేదని వెల్లడి
- చైనాతో ఆర్థిక లావాదేవీలన్నీ సంవత్సరాల తరబడి ఏకపక్షంగా సాగాయన్న ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షులు విదేశాలతో జరిపిన వ్యాపార లావాదేవీల విషయంలో తెలివిగా వ్యవహరించలేదని ట్రంప్ ఆరోపించారు. చైనా సహా ప్రపంచంలోని పలు దేశాలు అమెరికాతో ఇప్పటి వరకు జరిపిన లావాదేవీలలో చాలా లాభపడ్డాయని చెప్పారు. మాజీ అధ్యక్షుల ఉదారత్వాన్ని అడ్వాంటేజీగా తీసుకుని అమెరికాను ఒకరకంగా దోచుకున్నాయని విమర్శించారు. ఏళ్ల తరబడి సాగిన ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి తాను ప్రపంచ దేశాలపై టారిఫ్ లు విధిస్తున్నానని చెప్పారు.
‘మాతో వ్యాపారం చేస్తూ ఎంతో లాభపడ్డ చైనా.. ప్రస్తుతం ఆ దేశంలోని అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒప్పుకోను. ఈ విషయంలో చైనా తన తీరు మార్చుకోకుంటే ఇప్పటికే ప్రకటించినట్లు నవంబర్ 1 నుంచి చైనా నుంచి అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులపై 155 శాతం పన్ను వసూలు చేస్తాం. ఇంత భారీ పన్నులు చెల్లించడం చైనా ఎగుమతిదారులకు అంత సులభం కాదని భావిస్తున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు.