తిరువనంతపురంలో సౌదీ అరేబియా విమానం అత్యవసర ల్యాండింగ్

  • జకర్తా నుంచి మదీనాకు వెళుతున్న విమానంలో స్పృహ కోల్పోయిన ప్రయాణికురాలు
  • అత్యవసరంగా తిరువనంతపురంకు విమానం మళ్లింపు
  • ప్రయాణికురాలిని అనంతపురి ఆసుపత్రికి తరలింపు
ఇండోనేషియా నుంచి సౌదీ అరేబియాకు వెళుతున్న సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం తిరువనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇండోనేషియాలోని జకర్తా నుంచి మదీనాకు వెళుతున్న ఈ విమానంలో ఒక ప్రయాణికురాలు స్పృహ కోల్పోవడంతో విమానాన్ని అత్యవసరంగా తిరువనంతపురం మళ్లించారు.

ఇండోనేషియాకు చెందిన ఆ ప్రయాణికురాలిని అనంతపురి ఆసుపత్రికి తరలించినట్లు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు. సౌదీ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం 395 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో వెళుతుండగా లియా ఫటోనా అనే ప్రయాణికురాలు అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతూ స్పృహ కోల్పోయారు.

వెంటనే స్పందించిన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. తిరువనంతపురంలో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. తిరువనంతపురం విమానాశ్రయం నుంచి వెంటనే అనుమతి లభించడంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణికురాలిని వెంటనే అత్యవసర చికిత్స కోసం అనంతపురి ఆసుపత్రికి తరలించారు.


More Telugu News