Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్‌పై సంచలన కథనం.. దేశాన్ని చీల్చి పాలిస్తున్నారని ఆరోపణ!

Asim Munir Facing Unprecedented Public Opposition in Pakistan
షార్ట్స్‌లో చూడండి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, ఆ దేశ ఇటీవలి చరిత్రలో అత్యంత ప్రజాదరణ లేని సైనిక పాలకులలో ఒకరిగా నిలిచారని ఓ సంచలన నివేదిక వెల్లడించింది. ఆయన నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, మీడియా స్వేచ్ఛ హరించుకుపోయిందని, పాకిస్థాన్ సమాజం తీవ్రంగా చీలిపోయిందని ఆ నివేదిక తీవ్ర స్థాయిలో విశ్లేషించింది. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ న్యూస్ వెబ్ పోర్టల్ 'గ్లోబల్ విలేజ్ స్పేస్' మంగళవారం ఈ కథనాన్ని ప్రచురించింది.

గత సైనిక పాలకులతో పోలిస్తే, జనరల్ మునీర్‌కు అధికారంపై పట్టు ఉన్నప్పటికీ, ప్రజల నుంచి కానీ, వ్యవస్థల నుంచి కానీ ఎలాంటి చట్టబద్ధత కొరవడిందని ఈ కథనం స్పష్టం చేసింది. తన ముందున్న ఆర్మీ చీఫ్‌ల వలె ప్రజామోదం కోసం ప్రయత్నించకుండా, కేవలం కఠిన వైఖరితోనే ఆయన ముందుకు సాగుతున్నారని పేర్కొంది. ప్రస్తుతం పాకిస్థాన్ ఒక కీలకమైన కూడలిలో ఉందని, విదేశీ శత్రువుల పేరు చెప్పి పబ్బం గడుపుకునే అవకాశం లేకపోవడంతో, దేశంలో తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జనరల్ మునీర్ అత్యంత ప్రమాదకరమైన 'విభజన రాజకీయాలకు' తెరలేపారని ఆరోపించింది.

జాతి, ప్రాంతీయ విద్వేషాలే ఆయుధం

గ్లోబల్ విలేజ్ స్పేస్ కథనం ప్రకారం, తన అధికారాన్ని కాపాడుకోవడానికి మునీర్ దేశంలోని జాతి, ప్రాంతీయ గుర్తింపులనే ఆయుధాలుగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా పష్తూన్లు, ఆఫ్ఘన్లు, ఖైబర్ పఖ్తుంఖ్వా (KP) ప్రజలే దేశంలోని సమస్యలకు కారణమన్నట్లు సైనిక నాయకత్వం ప్రచారం చేస్తోంది. వారిని 'తాలిబనైజేషన్', అంతర్గత భద్రతా సమస్యలతో ముడిపెట్టి, దేశంలో సైనిక జోక్యాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నివేదిక విమర్శించింది. దేశీయ రాజకీయ సంక్షోభాన్ని జాతి, భద్రతాపరమైన సమస్యగా చిత్రీకరిస్తూ పాకిస్థానీయుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

వ్యవస్థలపై ఉక్కుపాదం

ఆసిమ్ మునీర్ తన రాజకీయ నియంత్రణను వ్యవస్థలన్నింటికీ విస్తరించారని నివేదిక పేర్కొంది. ఒకప్పుడు సైన్యాన్ని ప్రశ్నించే స్థాయిలో ఉన్న న్యాయవ్యవస్థ ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యమైపోయింది. సైన్యం జోక్యాన్ని ధైర్యంగా ప్రశ్నించిన న్యాయమూర్తులు బదిలీలకు గురవ్వడమో, రాజీనామా చేయడమో లేదా మౌనంగా పక్కకు తప్పుకోవడమో జరుగుతోందని వివరించింది. ఇక పోలీసులు, నిఘా సంస్థలు పూర్తిగా రాజకీయ అణచివేత సాధనాలుగా మారిపోయాయని, జాతీయ భద్రత పేరుతో సామాజిక కార్యకర్తలను అరెస్టు చేయడం, జర్నలిస్టులపై సెన్సార్‌షిప్ విధించడం, భిన్నాభిప్రాయాలను అణచివేయడం సర్వసాధారణమైందని తెలిపింది.

ప్రజాస్వామ్యానికి పాతర.. పెరుగుతున్న అసంతృప్తి

2024 సార్వత్రిక ఎన్నికలలో జరిగిన కఠోరమైన రిగ్గింగ్, దేశంలో ఎన్నికల చట్టబద్ధతకు మరణశాసనం రాసిందని నివేదిక అభివర్ణించింది. సైన్యం అండతో ఏర్పడిన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని, ప్రజా తీర్పును పొందలేదని విమర్శించింది. కేవలం అరెస్టులు, ఆదేశాలతోనే పాలన సాగుతోందని పేర్కొంది. మీడియా స్వీయ నియంత్రణ (self-censorship)తోనే మనుగడ సాగిస్తోందని, ఒకప్పుడు గట్టిగా అరచి చెప్పిన విషయాలను ఇప్పుడు జర్నలిస్టులు గుసగుసలాడుకుంటున్నారని వాపోయింది.

ఈ పరిణామాలతో పాకిస్థాన్‌లో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని, బలూచిస్థాన్ నుంచి గిరిజన జిల్లాల వరకు తీవ్ర అసంతృప్తి నెలకొని ఉందని నివేదిక హెచ్చరించింది. పాక్ ఆక్రమిత గిల్గిత్-బల్టిస్థాన్‌లో నిరసనలు, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సమ్మెలు, పంజాబ్ ప్రావిన్స్‌లో పెరుగుతున్న నిరుద్యోగం.. ఆర్థిక ఒత్తిడితో సమాజం కుప్పకూలుతోందనడానికి నిదర్శనాలని పేర్కొంది. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఒంటరితనం, నిరాశ అనేవి ఏ క్షణంలోనైనా పేలగల 'టైమ్ బాంబ్' వంటివని హెచ్చరించింది. "ప్రతి అసమ్మతి స్వరాన్ని దేశద్రోహంగా చిత్రీకరిస్తే, ఒకరోజు ఈ దేశాన్ని రక్షించడానికి పౌరులే మిగలరు" అని ఆ కథనం తీవ్ర స్వరంతో ముగించింది.
Go Back to Shorts
Asim Munir
Pakistan army chief
Pakistan political crisis
Pakistan economic crisis
Global Village Space
Pakistan military
Khyber Pakhtunkhwa
Pashtuns
Balochistan
Gilgit Baltistan

More Telugu News