Pawan Kalyan: కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినుల మృతి బాధాకరం: పవన్ కల్యాణ్

Pawan Kalyan Condolences on Kurupam Gurukula Student Deaths
షార్ట్స్‌లో చూడండి
కురుపాం బాలికల గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు అనారోగ్యంతో మృతి చెందడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా అధికారులు, వైద్యుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు.

విద్యార్థినులు కామెర్లు, సంబంధిత లక్షణాలతో అనారోగ్యానికి గురైనట్లు అధికారులు తనకు వివరించారని పవన్ పేర్కొన్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు విద్యార్థినులలో ఒకరు ఇంటి వద్ద, మరొకరు ఆసుపత్రిలో వేర్వేరు రోజుల్లో మరణించినట్లు తెలిసి తీవ్రంగా కలత చెందినట్లు చెప్పారు. మరణించిన విద్యార్థినుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న 37 మంది విద్యార్థినులకు విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో మెరుగైన చికిత్స అందిస్తున్నారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. బాధిత విద్యార్థినులకు అత్యుత్తమ వైద్యం అందించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అదనపు వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించి, విద్యార్థినుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

త్వరలోనే తాను స్వయంగా కురుపాం వెళ్లి గురుకుల పాఠశాలలోని పరిస్థితులను పరిశీలిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
Pawan Kalyan
Kurupam
Gurukula School
Andhra Pradesh
Student Deaths
Jaundice
Health Issues
Visakhapatnam KGH
TDP
Janasena

More Telugu News