Kailash Kuntevar: కేబీసీలో 50 లక్షలు గెల్చుకున్న మహారాష్ట్ర రైతు

పంట పొలాల్లో నిత్యం శ్రమించే ఓ రైతు అమితాబ్ బచ్చన్ నిర్వహించే ‘కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ)’ షో లో పాల్గొని పెద్ద మొత్తం గెల్చుకున్నారు. వరదలు, చీడ పీడలతో పంట నష్టపోయిన ఆ రైతును అదృష్టం కేబీసీ రూపంలో వరించింది. షో లో అమితాబ్ అడిగిన 14 ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పి రూ.50 లక్షలు గెల్చుకున్నారు. కోటి రూపాయల ప్రశ్న విషయంలో జవాబు తెలియక రిస్క్ వద్దనుకుని పోటీ నుంచి తప్పుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన కైలాశ్ కుంటేవార్ తన కేబీసీ అనుభవం గురించి మీడియాతో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను చదువులో ముందుండే వాడినని చెప్పారు. కేబీసీ షో వినోదం కోసమేనని భావించేవాడినని, 2018లో ఈ షోలో డబ్బు గెల్చుకున్న వ్యక్తితో మాట్లాడాక సీరియస్ గా దీనిపై దృష్టి సారించానని చెప్పారు. అప్పటి నుంచి కేబీసీ కోసం ప్రత్యేకంగా సిద్ధమైనట్లు వెల్లడించారు. రోజంతా పొలంలో కష్టపడ్డా ఇంటికి వచ్చాక కనీసం ఒక గంటపాటు కేబీసీ కోసం ప్రిపేర్ అయినట్లు కైలాశ్ తెలిపారు.

షోలో అమితాబ్ అడిగిన ప్రశ్నలకు వరుసగా సరైన జవాబులు చెబుతూ 50 లక్షలు గెల్చుకున్నానని, కోటి రూపాయల ప్రశ్న విషయంలో కొంత సందిగ్ధం నెలకొందని చెప్పారు. దీంతో రిస్క్ తీసుకోలేక అప్పటి వరకు గెల్చుకున్న 50 లక్షలతో పోటీ నుంచి తప్పుకున్నట్లు కైలాశ్ వివరించారు. తాను గెల్చుకున్న సొమ్మును ఖర్చు చేసే విషయంలో పిల్లల చదువులకే ప్రథమ ప్రాధాన్యమిస్తానని కైలాశ్ తెలిపారు.
Kailash Kuntevar
Kaun Banega Crorepati
KBC
Amitabh Bachchan
Maharashtra farmer
Indian television show
KBC winner
Farmer success story
Crop loss
Indian agriculture

More Telugu News