డ్రగ్స్ దందా.. 16,000 మంది విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సంబంధిత కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 16,000 మంది విదేశీ పౌరులను దేశం నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ భారీ బహిష్కరణ ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇటీవలి కాలంలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి చేపట్టిన అతిపెద్ద చర్యల్లో ఇది ఒకటిగా నిలవనుంది. డ్రగ్స్ స్మగ్లింగ్ నుంచి రవాణా వరకు వివిధ రకాల నేరారోపణలు ఎదుర్కొంటున్న విదేశీయులను గుర్తించి, వారి జాబితాను ఎన్‌సీబీ సిద్ధం చేసింది.

ఈ జాబితాను ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత ఏజెన్సీలకు అందజేసినట్లు సమాచారం. బహిష్కరణకు గురికానున్న వారిలో బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, మలేషియా, ఘనా, నైజీరియా వంటి దేశాలకు చెందిన వారు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న డిటెన్షన్ కేంద్రాల్లో అదుపులో ఉన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన వలస చట్టంలోని నిబంధనల ప్రకారం వీరిని వారి సొంత దేశాలకు పంపించే ప్రక్రియను చేపట్టనున్నారు.

Drugs
Drug trafficking
Narcotics Control Bureau
NCB
Foreign nationals
Deportation
India

More Telugu News