హైదరాబాద్‌లో మరోసారి భూముల వేలం.. కనీస ధర ఎకరా రూ.101 కోట్లు

Telangana Government Announces E Auction for Rayadurgam Land
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిధుల సమీకరణకు సిద్ధమైంది. హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలో ఉన్న రాయదుర్గంలో విలువైన ప్రభుత్వ భూములను ఈ-వేలం వేయాలని నిర్ణయించింది. ఈ వేలంలో ఎకరాకు కనీస ధరను ఏకంగా రూ.101 కోట్లుగా ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ భూముల విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ.2000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... గచ్చిబౌలికి సమీపంలోని రాయదుర్గం సర్వే నంబర్ 83/1లో ఉన్న మొత్తం 18.67 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఇందులో ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు, ప్లాట్ నంబర్ 15ఎ/2లో 7.67 ఎకరాలు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ-వేలం ప్రక్రియ అక్టోబర్ 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్‌లో జరగనుంది. వేలంలో పాల్గొనాలనుకునే సంస్థలు లేదా వ్యక్తులు అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ భూములను సందర్శించేందుకు అవకాశం కల్పించారు.

వేలంలో పాల్గొనేందుకు కొన్ని నిబంధనలను కూడా టీజీఐఐసీ స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ కోసం తిరిగి చెల్లించని విధంగా జీఎస్టీతో కలిపి రూ.1,180 చెల్లించాలి. ప్రతి ప్లాట్‌కు బిడ్ డాక్యుమెంట్ ఫీజుగా రూ.10 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది. వేలంలో కనీస బిడ్ పెంపు ఎకరాకు రూ.50 లక్షలు ఉండాలని అధికారులు నిర్దేశించారు. ఐటీ హబ్‌కు దగ్గరగా ఉండటంతో ఈ భూములకు భారీ డిమాండ్ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
Go Back to Shorts
Telangana Government
Hyderabad land auction
Rayadurgam
TGIIIC
land sale
real estate
Gachibowli
IT corridor
e-auction
land value

More Telugu News