Ayesha Meera: ఆయేషా మీరా తల్లిదండ్రులకు విజయవాడ సీబీఐ కోర్టు నోటీసులు

Ayesha Meera Parents Refuse CBI Court Notice in Vijayawada
షార్ట్స్‌లో చూడండి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విజయవాడ సీబీఐ కోర్టు పంపిన నోటీసులను స్వీకరించేందుకు ఆయేషా తల్లిదండ్రులు నిరాకరించారు. న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న తమను పదేపదే కోర్టుల చుట్టూ తిప్పడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే, కేసులో నిందితుడిగా ఉన్న పిడతల సత్యంబాబుపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 302 (హత్య) అభియోగాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సీబీఐ కోర్టు ఆయేషా తల్లిదండ్రులకు తాజాగా నోటీసులు పంపింది. ఈ నెల 19వ తేదీన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై తమ వాదనలు వినిపించాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది.

అయితే, కోర్టు పంపిన నోటీసులను ఆయేషా తల్లిదండ్రులు తీసుకోలేదు. తమకు ఇప్పటివరకూ సీబీఐ తుది దర్యాప్తు నివేదికను అందజేయలేదని, నివేదిక కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని వారు తెలిపారు. ఈ విషయాన్ని ఒక లేఖ రూపంలో నోటీసులకు జతచేసి, వాటిని తిరిగి కోర్టుకు పంపారు.

ఈ సందర్భంగా శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను వెళ్లగక్కారు. "న్యాయం కోసం ఇన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం. మమ్మల్ని ఇంకా ఎన్నిసార్లు కోర్టుల చుట్టూ తిప్పుతారు?" అని వారు వాపోయారు. దర్యాప్తు నివేదిక చేతికి అందనిదే, నిందితుడిపై మోపిన అభియోగాలపై తాము ఎలా స్పందించగలమని వారు ప్రశ్నించారు. ఈ ఘటనతో ఆయేషా మీరా కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 
Go Back to Shorts
Ayesha Meera
Ayesha Meera case
Vijayawada CBI Court
Pidathala Satyam Babu
Andhra Pradesh
B Pharmacy student murder
CBI investigation
High Court petition
Crime news
Murder case

More Telugu News