Koduri Lakshmi Praharshita: న్యాయశాస్త్రంలో 18 గోల్డ్ మెడల్స్ సాధించిన కోడూరి లక్ష్మీ ప్రహర్షిత 

ఏపీకి చెందిన కోడూరి లక్ష్మీప్రహర్షిత న్యాయశాస్త్రంలో ఏకంగా 18 గోల్డ్ మెడల్స్ సాధించి అచ్చెరువొందించారు. విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ నుంచి కోడూరి లక్ష్మీ ప్రహర్షిత న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. న్యాయశాస్త్రంలో ఆమె వివిధ సబ్జెక్టుల్లో ఏకంగా 17 బంగారు పతకాలు అందుకుని యూనివర్సిటీ టాపర్ గా నిలిచారు. బ్యాచ్ టాపర్ గా మరో గోల్డ్ మెడల్ కూడా యూనివర్సిటీ నుంచి అందుకున్నారు. 

ఐదేళ్ల లా కోర్సు తర్వాత ఆమె ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. విజయవాడ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యాసంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. 

తాజాగా, కోడూరి లక్ష్మీ ప్రహర్షితను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కమర్షియల్ చట్టాలు, కార్పొరేట్ లిటిగేషన్ అంశాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నట్టు వెల్లడించారు. తాను సాధించిన విజయాలకు కుటుంబ పరంగా సంపూర్ణ మద్దతు ఉందని సంతోషంగా చెప్పారు. తన తండ్రికి న్యాయశాస్త్రం బ్యాక్ గ్రౌండ్ ఉందని, ప్రస్తుతం ఏపీ ఎండోమెంట్ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తున్నారని లక్ష్మీ ప్రహర్షిత తెలిపారు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంపై ఇష్టం పెరిగిందని, ఇంట్లో ఎక్కువ లా పుస్తకాలు ఉండడంతో ఆ దిశగా తాను, తన సోదరి అడుగులు వేశామని వివరించారు. 2022లో బీఎ ఎల్ఎల్ బీ పూర్తయిందని అన్నారు. 

ఇక, ఇటీవల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేశానని, ఇకపై న్యాయవాదిగా ప్రాక్టీసు చేయడంపై దృష్టిసారిస్తానని తెలిపారు. అదే తన లక్ష్యం అని పేర్కొన్నారు. 
Koduri Lakshmi Praharshita
Law student
18 gold medals
Damodaram Sanjivayya National Law University
Commercial law
Corporate litigation
AP Endowment Commissioner
Vijayawada Siddhartha Academy
University College of London
Law practice

More Telugu News