Chandrababu Naidu: ఏపీలో 11 మంది ఐఏఎస్‌ల బదిలీ... టీటీడీకి కొత్త ఈవో

AP Government Transfers 11 IAS Officers Key Appointments Made
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ బదిలీలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా సీనియర్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించారు.

ప్రస్తుతం టీటీడీ ఈవోగా పనిచేస్తున్న శ్యామలరావును సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా  కృష్ణబాబును నియమించారు. రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముఖేశ్ కుమార్ మీనా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇతర ముఖ్య నియామకాల్లో భాగంగా, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్‌ను, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్‌ను ప్రభుత్వం నియమించింది. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ప్రవీణ్ కుమార్, పరిశ్రమలు, కార్మిక శాఖ కమిషనర్‌గా శేషగిరిబాబును నియమించారు. ఎండోమెంట్ రెవెన్యూ కార్యదర్శిగా హరి జవహర్‌లాల్‌కు బాధ్యతలు అప్పగించారు.

గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఐఏఎస్ అధికారుల పనితీరుపై సమీక్షలు జరిపారు. పరిపాలనలో వేగం పెంచేందుకు, అధికారుల పనితీరును మెరుగుపరిచేందుకు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పనితీరును ప్రామాణికంగా తీసుకుని, సమర్థులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించాలనే లక్ష్యంతో ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh IAS transfers
TTD EO Anil Kumar Singhal
Shyamala Rao
Krishna Babu
AP government
IAS officers transfers
Tirumala Tirupati Devasthanam

More Telugu News