ధోని వల్లే కెరీర్ ముగిసిందా?.. వైరల్ వీడియోపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్

  • ధోనీపై ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యల పాత వీడియో వైరల్
  • వీడియో వెనుక పీఆర్ లాబీ ఉందంటూ పఠాన్ అనుమానం
  • ఇది అభిమానుల మధ్య గొడవేనా? అని ప్రశ్న
  • ధోనీతో తన సంభాషణను గుర్తుచేసుకున్న మాజీ ఆల్‌రౌండర్
  • ఎవరి రూమ్‌లోనో హుక్కా పెట్టే అలవాటు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన కెరీర్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాత వీడియోపై తీవ్రంగా స్పందించాడు. ఐదేళ్ల కిందటి వీడియోను ఇప్పుడు అసందర్భంగా వైరల్ చేయడం వెనుక కుట్ర ఉందని, ఇది ‘అభిమానుల మధ్య గొడవ’ లేదా ‘పీఆర్ లాబీ’ పనేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.

కొంతకాలంగా సోషల్ మీడియాలో ఇర్ఫాన్ పఠాన్‌కు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ చక్కర్లు కొడుతోంది. అందులో ఆయన, అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ కారణంగానే తన కెరీర్ ముగిసిపోయిందన్న అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఆ వీడియోపై నెటిజన్లు ఎంఎస్‌డీని విమర్శిస్తుండటంతో ఇర్ఫాన్ పఠాన్ స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇచ్చాడు.

వైరల్ వీడియోలో ఏముంది?
ఐదేళ్ల కిందటి ఆ ఇంటర్వ్యూలో పఠాన్ మాట్లాడుతూ.. "2008 ఆస్ట్రేలియా సిరీస్ సమయంలో నా బౌలింగ్ మీద ధోనీకి సంతృప్తిగా లేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ సిరీస్ మొత్తం నేను బాగానే బౌలింగ్ చేశానని భావించి, నేరుగా మహీ భాయ్‌నే అడిగాను. కొన్నిసార్లు మీడియాలో మాటలను వక్రీకరిస్తారు కదా, అందుకే స్పష్టత కోసం వెళ్లాను. దానికి ధోనీ, ‘లేదు ఇర్ఫాన్, అలాంటిదేమీ లేదు. అంతా అనుకున్నట్టే జరుగుతోంది’ అని బదులిచ్చారు. అలా సమాధానం వచ్చాక నమ్మడం తప్ప ఏం చేయగలం? పదేపదే అడిగితే మన ఆత్మగౌరవాన్ని మనమే కించపరుచుకున్నట్టు అవుతుంది" అని గుర్తుచేసుకున్నాడు.

అంతేకాకుండా, "నాకు ఎవరి రూమ్‌లోనో హుక్కా పెట్టే అలవాటు లేదు. అనవసరంగా మాట్లాడటం కూడా చేతకాదు. ఈ విషయం అందరికీ తెలుసు. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిది. క్రికెటర్ పని మైదానంలో రాణించడమే. నేను దానిపైనే దృష్టి పెట్టాను" అని పఠాన్ ఆ వీడియోలో వ్యాఖ్యానించాడు. చివరిసారిగా 2012లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పఠాన్, తన చివరి వన్డేలో ఐదు వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఇప్పుడు ఈ పాత వీడియో కొత్త వివాదానికి తెరలేపింది.


More Telugu News