కవిత ఇంకా వేరే విషయాలు మాట్లాడితే బాగుండేది: రఘునందన్ రావు

  • రేవంత్ రెడ్డి, హరీశ్ రావు కుమ్మక్కయ్యారని గతంలోనే చెప్పానన్న ఎంపీ
  • బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల గురించి తాను మాట్లాడదల్చుకోలేదని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద విస్తరించినట్టు తేలిందన్న ఎంపీ
కవిత ఈరోజు ప్రెస్‌మీట్‌లో కొత్తగా చెప్పిందేమీ లేదని, ఆమె ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడితే బాగుండేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కుమ్మక్కయ్యారని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు.

హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల గురించి తాను మాట్లాడదల్చుకోలేదని అన్నారు. కవిత ప్రస్తావించిన మోకిల ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై విచారణ జరపాలని ఆయన కోరారు. జడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో గతంలో కేసీఆర్‌కు చెప్పానని, కానీ ఆ రోజు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలని చూసినట్లు కూడా గతంలోనే చెప్పానని అన్నారు.

కవిత నేటి ప్రెస్ మీట్‌తో బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద విస్తరించినట్టు తేలిందని రఘునందన్ రావు అన్నారు. మళ్లీ వచ్చే ఎపిసోడ్‌లో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిని బయటపెడితే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు చేసిన అక్రమాలపై బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.


More Telugu News