భారత్‌తో రష్యా దోస్తీ మాకు ఓకే.. పుతిన్‌తో భేటీలో పాక్ ప్రధాని కీలక వ్యాఖ్యలు

  • బీజింగ్‌లో పుతిన్‌తో పాక్ ప్రధాని షెహబాజ్ భేటీ
  • భారత్‌తో రష్యా సంబంధాలపై తమకు అభ్యంతరం లేదని స్పష్టీకరణ
  • మాస్కోతో బలమైన బంధాన్ని కోరుకుంటున్నామన్న షెహబాజ్ షరీఫ్
  • చైనా సైనిక పరేడ్‌కు హాజరైన ఇద్దరు దేశాధినేతలు
భారత్‌తో రష్యాకు ఉన్న సంబంధాల పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. రష్యాతో తమ దేశం కూడా బలమైన సంబంధాలను నిర్మించుకోవాలని కోరుకుంటోందని ఆయన అన్నారు. నిన్న చైనా రాజధాని బీజింగ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో షెహబాజ్ షరీఫ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ భేటీలో షరీఫ్ మాట్లాడుతూ "భారత్‌తో రష్యాకు ఉన్న సంబంధాలను మేము గౌరవిస్తాం. వాటితో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అదే సమయంలో మేము కూడా మాస్కోతో చాలా బలమైన సంబంధాలను నిర్మించుకోవాలనుకుంటున్నాం. ఈ ప్రాంత అభివృద్ధికి, శ్రేయస్సుకు ఈ బంధం ఎంతగానో ఉపయోగపడుతుంది" అని వివరించారు. పుతిన్‌ను అత్యంత డైనమిక్ నాయకుడిగా అభివర్ణించిన షరీఫ్ ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా నిర్వహించిన భారీ సైనిక పరేడ్‌కు హాజరయ్యేందుకు పుతిన్, షరీఫ్ ఇద్దరూ బీజింగ్ వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా పుతిన్.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోలతో కూడా వేర్వేరుగా సమావేశమయ్యారు.

ఈ పరిణామాలకు ఒకరోజు ముందు షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఉగ్రవాదం అనేది కేవలం ఒక దేశానికే కాకుండా, మొత్తం మానవాళికే పెను ముప్పు అని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలను సహించేది లేదని తేల్చిచెప్పారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన తాజా ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ గత నాలుగు దశాబ్దాలుగా భారత్ ఉగ్రవాదం వల్ల ఎంతో నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మద్దతుగా నిలుస్తున్న మిత్రదేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


More Telugu News