Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

Afghanistan Earthquake Kills Over 250 People
షార్ట్స్‌లో చూడండి
ఆగ్నేయ ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి సంభవించిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. కునార్ ప్రావిన్స్‌లోని పలు జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు దేశ సమాచార మంత్రిత్వ శాఖ అనడోలు వార్తా సంస్థకు వెల్లడించింది.

స్థానిక కాలమానం ప్రకారం గత రాత్రి 11:47 గంటలకు భూమి కంపించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జెడ్) పేర్కొంది. భూకంప కేంద్రం బసావుల్ పట్టణానికి 36 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్నట్టు గుర్తించారు. లోతు తక్కువగా ఉండటంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.

కునార్ ప్రావిన్స్‌లోని నూర్ గల్, సావ్కి, వాత్‌పుర్, మనోగీ, చపా దారా జిల్లాల్లో అత్యధిక ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప ప్రభావం ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నుంచి సుమారు 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వరకు కనిపించింది. ఇక్కడ కూడా కొన్ని సెకన్ల పాటు భవనాలు కంపించాయని ఏఎఫ్‌పీ జర్నలిస్టులు పేర్కొన్నారు.

అక్టోబర్ 7, 2023న కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ విపత్తులో కనీసం 4,000 మంది చనిపోయారని తాలిబన్ ప్రభుత్వం అంచనా వేయగా, ఐక్యరాజ్యసమితి మాత్రం మృతుల సంఖ్య సుమారు 1,500 అని పేర్కొంది. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకటిగా అది నిలిచింది.
Go Back to Shorts
Afghanistan Earthquake
Afghanistan
Earthquake
Kunar Province
Taliban
Pakistan
Islamabad
USGS
Natural Disaster

More Telugu News