క్రికెట్ కు వీడ్కోలు పలికిన పుజారా.. సోషల్ మీడియాలో వెల్లడి

  • అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ప్రకటన
  • క్రికెట్ జర్నీలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు
  • వంద టెస్టులు ఆడి 7 వేలకు పైగా పరుగులు చేసిన వెటరన్ క్రికెటర్
భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు ఛటేశ్వర్ పుజారా రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. భారత జట్టుకు ఆడాలన్న కలను నెరవేర్చుకోవడంలో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు.

పుజారా వీడ్కోలు సందేశం ఇదే..
“భారత జెర్సీ ధరించడం, మైదానంలో జాతీయ గీతం ఆలపించడం, జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించడం.. ఇవన్నీ గర్వకారణం. అయితే, ఏదో ఒకరోజు వీటికి ముగింపు పలకాల్సిందే. ఆ సమయం వచ్చేసింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నా. రాజ్‌ కోట్‌ పట్టణం నుంచి కుటుంబంతో కలిసి వచ్చిన ఓ కుర్రాడు.. భారత క్రికెట్‌లోకి అడుగు పెట్టాలనే కలను నెరవేర్చుకున్నాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, ఎందరో సహకరించారు.. ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్‌కు కృతజ్ఞతలు. కుటుంబం, సహచర క్రికెటర్లు, సపోర్ట్‌ స్టాఫ్‌, నెట్ బౌలర్లు, అనలిస్ట్‌లు, లాజిస్టిక్‌లు, అంపైర్లు, గ్రౌండ్ స్టాఫ్, స్కోరర్లు, మీడియా పర్సనల్, స్పాన్సర్లు, పార్టనర్స్‌, మేనేజ్‌మెంట్‌ సహకారం మరువలేనిది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇకపై నా కుటుంబం కోసం మరింత సమయం వెచ్చించేందుకు ప్రయత్నిస్తా’’ అని పుజారా వెల్లడించాడు.
 
పుజారా గణాంకాలివే..
  • 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ
  • 103 టెస్టుల్లో 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీలతో 7,195 పరుగులు
  • 5 వన్డేలు మాత్రమే ఆడిన పుజారా మొత్తంగా 51 పరుగులు చేశాడు
  • 2023లో ఆస్ట్రేలియాతో పుజారా తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు


More Telugu News