ఐపీఎల్ ట్రేడింగ్‌లో సంచలనం.. సంజూ శాంసన్ కోసం కేకేఆర్ మాస్టర్ ప్లాన్

  • సంజూ శాంసన్‌ రాజస్థాన్ రాయల్స్‌ను వీడనున్నట్టు ఊహాగానాలు
  • శాంసన్‌ను దక్కించుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ తీవ్ర ప్రయత్నాలు
  • రమన్‌దీప్ లేదా రఘువంశీతో పాటు నగదు ఇచ్చేందుకు కేకేఆర్ సుముఖత
  • సంజూ కోసం రేసులో చెన్నై సూపర్ కింగ్స్ కూడా
  • స్టార్ ఆటగాళ్లను వదులుకునేందుకు సీఎస్కే విముఖత చూపడంతో చర్చలు ఫలించని వైనం
ఐపీఎల్ వర్గాల్లో ప్రస్తుతం భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. అతను తన ప్రస్తుత జట్టు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌)ను వీడతాడనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న వేళ, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడిని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ట్రేడింగ్ కోసం ఒక ఆసక్తికర ప్రతిపాదనతో కేకేఆర్ ముందుకొచ్చినట్లు సమాచారం.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ ద్వారా తమ జట్టులోకి తీసుకునేందుకు కేకేఆర్ వ్యూహరచన చేస్తోంది. యువ ఆటగాళ్లు అంగ్‌క్రిష్ రఘువంశీ లేదా ర‌మన్‌దీప్ సింగ్‌లలో ఒకరిని రాజస్థాన్‌కు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఐపీఎల్ నిబంధనల ప్రకారం సంజూ శాంసన్ విలువ రూ. 18 కోట్లు కాగా, రఘువంశీ విలువ రూ. 3 కోట్లు, రమన్‌దీప్ విలువ రూ. 4 కోట్లుగా ఉంది. దీంతో వీరిలో ఎవరిని ఇచ్చినా, కేకేఆర్ భారీ మొత్తంలో నగదును రాజస్థాన్‌కు చెల్లించాల్సి ఉంటుంది.

శాంసన్ కోసం కేకేఆర్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కూడా పోటీ పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, సంజూకు బదులుగా రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే లేదా రవీంద్ర జడేజాలలో ఒకరిని ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ కోరినట్లు సమాచారం. కానీ, తమ కీలక ఆటగాళ్లను వదులుకోవడానికి సీఎస్కే ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీంతో ఈ డీల్‌లో కేకేఆర్ ముందు వరుసలో ఉన్నట్టు కనిపిస్తోంది.

ఈ ట్రేడింగ్ వార్తలు జోరుగా సాగుతున్న సమయంలోనే సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌తో తనకున్న అనుబంధం గురించి భావోద్వేగంగా మాట్లాడాడు. ఇటీవల ఆర్ అశ్విన్‌తో ఓ యూట్యూబ్ షోలో మాట్లాడుతూ, "ఆర్ఆర్ నా జీవితంలో ఓ ప్రపంచం లాంటిది. కేరళలోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన నాకు రాహుల్ ద్రవిడ్, మనోజ్ బడాలే సార్ నా ప్రతిభను ప్రపంచానికి చూపించేందుకు ఓ వేదిక ఇచ్చారు" అని శాంసన్ పేర్కొన్నాడు. జట్టును వీడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.


More Telugu News