నల్గొండ మైనర్‌ బాలికపై హత్యాచారం కేసు.. నిందితుడికి ఉరిశిక్ష వేసిన కోర్టు!

  • 2013లో 12 ఏళ్ల‌ బాలికపై హ‌త్యాచారానికి పాల్ప‌డ్డ నిందితుడు
  • అఘాయిత్యం అనంత‌రం బాలిక‌ను చంపి, మృతదేహాన్ని కాలువలో పడేసిన వైనం
  • నిందితుడిపై పోక్సో చ‌ట్టం, హ‌త్యా నేరం కింద కేసు న‌మోదు
  • గ‌త ప‌దేళ్లుగా నల్గొండ కోర్టులో వాద‌న‌లు
  • ఈ రోజు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన న్యాయమూర్తి రోజా రమణి
మైనర్‌ బాలికపై హత్యాచారం కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెల్ల‌డించింది. నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ న్యాయ‌స్థానం తీర్పునిచ్చింది. వివ‌రాల్లోకి వెళితే... 2013లో నల్గొండకు చెందిన మోహమ్మీ ముకర్రం అనే వ్య‌క్తి.. 12 ఏళ్ల‌ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. అదే అదునుగా ఆ మైన‌ర్ బాలిక‌పై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. ఈ విష‌యాన్ని బాలిక ఎక్క‌డ బ‌య‌ట‌పెడుతుందోన‌ని ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశాడు.

నిందితుడు ముకర్రంను అరెస్టు చేసిన‌ నల్గొండ వన్‌టౌన్‌ పోలీసులు అత‌నిపై పోక్సో చట్టం, హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై గత పదేళ్లుగా జిల్లా కోర్టులో వాదనలు కొన‌సాగుతున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితుడికి మ‌ర‌ణ‌శిక్ష‌ విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఉరిశిక్ష‌తో పాటు రూ.1.10 లక్షల జరిమానా కూడా విధించారు. 


More Telugu News