'ది రాజా సాబ్ 2' పక్కా.. కానీ సీక్వెల్ కాదు: నిర్మాత టీజీ విశ్వప్రసాద్

  • ప్రభాస్ 'రాజా సాబ్'కు రెండో భాగం ఉంటుందని నిర్ధారణ
  • అయితే అది సీక్వెల్ కాదని, కొత్త కథతో వస్తుందని నిర్మాత వెల్లడి
  • అక్టోబర్ చివరికి పూర్తి కానున్న మొదటి భాగం చిత్రీకరణ
  • డిసెంబర్ లేదా వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు చర్చలు
  • సినిమాలో ప్రభాస్ తాతగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్
  • దాదాపు మూడు గంటల నిడివితో రానున్న సినిమా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ది రాజా సాబ్'. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఇందులో ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉందని తెలిపారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విశ్వప్రసాద్, "'రాజా సాబ్ 2' కచ్చితంగా ఉంటుంది. కానీ అది మొదటి భాగానికి కొనసాగింపుగా రాదు. మొదటి సినిమాలోని హారర్-కామెడీ థీమ్‌తో, అదే తరహా అంశాలతో ఫ్రాంచైజీగా వస్తుంది. అంటే, కథ మాత్రం పూర్తిగా కొత్తగా ఉంటుంది" అని వివరించారు. దీనివల్ల 'సలార్', 'కల్కి' చిత్రాల తరహాలోనే 'రాజా సాబ్' కూడా ఒక ప్రత్యేక ఫ్రాంచైజీగా విస్తరించే అవకాశం ఉందని అర్థమవుతోంది.

ప్రస్తుతం 'ది రాజా సాబ్' మొదటి భాగం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రధాన చిత్రీకరణ పూర్తి కాగా, కొన్ని పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, సినిమా విడుదల తేదీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పండగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని పంపిణీ వర్గాల నుంచి ఒత్తిడి వస్తుండగా, హిందీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదల చేయాలని కోరుతున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రభాస్ కు తాతగా కీలక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. మొదట ఈ సినిమా నిడివి నాలుగున్నర గంటలకు పైగా రాగా, దర్శకుడు మారుతి దానిని ఎడిట్ చేసి దాదాపు 2 గంటల 45 నిమిషాలకు కుదించే పనిలో ఉన్నారని, ఫైనల్ వెర్షన్ మూడు గంటల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.


More Telugu News