పోలీస్ కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో సంచలన ఆరోపణలు

  • ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘటన
  • ఆత్మహత్యకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో సెల్ఫీ వీడియో పోస్ట్
  • నాలుగు నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్న వైనం
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పోలీస్ కానిస్టేబుల్ అనురాగ్ సింగ్ భార్య సౌమ్య కశ్యప్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యకు ముందు సౌమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో తన అత్తమామలు, భర్త, బావమరిది తనను తీవ్రంగా హింసించారని, తన భర్త మరో వివాహం చేసుకోవడానికి తనను చంపేయాలని కుట్ర పన్నారని ఆమె ఆరోపించింది.

సౌమ్య కశ్యప్ తన చివరి వీడియోలో తీవ్ర ఆవేదనతో, కన్నీళ్లతో కనిపించింది. "నా అత్తమామలు, బావమరిది, నా భర్త అనురాగ్ సింగ్ నన్ను చంపాలని చూస్తున్నారు. తర్వాత, ఆయన మరో మహిళను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు" అని పేర్కొంది. తన భర్త మామ ఒక లాయర్ అని, తనను చంపిస్తే ఆయనను కాపాడతానని చెప్పాడని ఆరోపించింది. ఈ వీడియోలో ఆమె తన గాయాలను చూపించింది. 

సౌమ్య భర్త అనురాగ్ సింగ్ బక్షీ కా తలాబ్ పోలీస్ స్టేషన్‌లో ఈగల్ మొబైల్ యూనిట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. సౌమ్య నిన్న తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియో ద్వారానే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సౌమ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, సౌమ్య, అనురాగ్ సింగ్ నాలుగు నెలల క్రితమే లవ్ మ్యారేజ్ చేసుకోవడం గమనార్హం. 


More Telugu News