టీమిండియా స్టార్ క్రికెటర్ల ఆదాయంపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

  • ఏడాదికి రూ.100 కోట్లు సంపాదిస్తారన్న రవిశాస్త్రి 
  • బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని వెల్లడి
  • స్టార్ క్రికెటర్లు 15-20 యాడ్స్ చేస్తుంటారని వివరణ
భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి, ప్రస్తుత భారత క్రికెట్ స్టార్ల ఆదాయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వారి వార్షిక ఆదాయం రూ. 100 కోట్లు దాటుతుందని అంచనా వేశాడు. ఈ భారీ సంపాదనకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని శాస్త్రి స్పష్టం చేశాడు.

'ది ఓవర్‌ల్యాప్ క్రికెట్' అనే కార్యక్రమంలో భారత క్రికెటర్ల జీవితం, ఒత్తిళ్ల గురించి మాట్లాడుతూ, వారి ఆదాయం గురించి అడిగినప్పుడు శాస్త్రి ఈ విషయాలను వెల్లడించారు. కచ్చితమైన అంకెలు తనకు తెలియకపోయినా, అది రూ. 100 కోట్ల వరకు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు పెద్ద సంఖ్యలో వాణిజ్య ప్రకటనలలో నటిస్తున్నారని, దీని ద్వారా వారు భారీ మొత్తంలో సంపాదిస్తున్నారని శాస్త్రి పేర్కొన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు, అక్కడే ఉన్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైఖేల్ వాఘన్, అలిస్టర్ కుక్ ఆశ్చర్యానికి లోనయ్యారు. 

"వారు చాలా సంపాదిస్తారు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా చాలా ఎక్కువ సంపాదిస్తారు. అది బహుశా రూ. 100 కోట్లకు పైగానే ఉండొచ్చు. ఇక మీరు లెక్క వేసుకోండి" అని శాస్త్రి అన్నారు. ధోని, విరాట్, లేదా సచిన్ టెండూల్కర్ తమ కెరీర్‌లో అగ్రస్థానంలో ఉన్నప్పుడు 15-20 యాడ్స్ చేసేవారని, కేవలం ఒక రోజు షూట్ చేసి, ఆ ఫుటేజిని ఏడాది పొడవునా ఉపయోగించుకోవచ్చని ఆయన వివరించారు.


More Telugu News