కోడళ్ల గొడవ ఆపబోయి.. తోపులాటలో అత్త మృతి

హైదరాబాద్‌లో ఓ కుటుంబంలో జరిగిన గొడవ తీవ్ర విషాదానికి దారితీసింది. ఇద్దరు కోడళ్ల మధ్య జరుగుతున్న పోట్లాటను ఆపేందుకు ప్రయత్నించిన అత్త, ఆ తోపులాటలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయ విదారక ఘటన బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ అందించిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్‌లోని అసద్‌బాబానగర్‌కు చెందిన మహమూద్ (45)కు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇటీవల షహజాదీ బేగం అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి సవతులైన ఇద్దరు భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి వీరి మధ్య మరోసారి వాగ్వాదం మొదలైంది.

ఈ గొడవను ఆపేందుకు మహమూద్ తల్లి మహమూద్‌బీ (65) వారి మధ్యలోకి వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు కోడళ్లు ఆమెను పక్కకు నెట్టివేయడంతో అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన ఆమెకు రక్తపోటు (బీపీ) ఒక్కసారిగా పెరిగిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Hyderabad
Mahmood Bee
Bahadurpura
Wife fight
Family dispute
Murder
Asad Baba Nagar
Telangana
Crime news
Domestic violence

More Telugu News