అతివేగంతో దూసుకొచ్చిన స్పోర్ట్స్ బైక్.. డెలివరీ బాయ్ సహా ఇద్దరు మృతి

  • కర్ణాటకలోని మైసూరులో ఘోర రోడ్డు ప్రమాదం
  • అతివేగంతో దూసుకొచ్చిన హయబూసా బైక్ బీభత్సం
  • ఫుడ్ డెలివరీ ఏజెంట్‌ను బలంగా ఢీకొట్టిన వైనం
  • ప్రమాదంలో డెలివరీ ఏజెంట్, బైకర్ ఇద్దరూ మృతి
  • స్తంభాన్ని ఢీకొని దగ్ధమైన స్పోర్ట్స్ బైక్
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సీసీటీవీ దృశ్యాలు
కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. జూలై 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతివేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్ బైక్ బీభత్సం సృష్టించడంతో ఫుడ్ డెలివరీ ఏజెంట్, బైక్ నడుపుతున్న యువకుడు మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కాగా, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే, జొమాటో డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న కార్తీక్ తన ద్విచక్ర వాహనంపై రోడ్డు పక్కన వెళుతున్నాడు. అదే సమయంలో సయ్యద్ సరూన్ అనే యువకుడు సుజుకీ హయబూసా స్పోర్ట్స్ బైక్‌పై అతి వేగంగా వచ్చి కార్తీక్ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఢీకొన్న తర్వాత అదుపుతప్పిన హయాబుసా బైక్ కొంతదూరం వరకు రోడ్డుపై జారుకుంటూ వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌లోని పెట్రోల్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్న, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News