Manda Krishna Madiga: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని కలిసిన మంద కృష్ణ మాదిగ!

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్లను పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైనట్లు ఆయన ప్రకటించారు. హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 13న హైదరాబాద్‌లో 'ఛలో దివ్యాంగుల మహాగర్జన' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

మంగళవారం ఆయన హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావును కలిసి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ, దివ్యాంగుల సమస్యలపై ప్రతిపక్షాలు కూడా సరిగా స్పందించకపోవడం వల్లే తాము ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలిసి మద్దతు కోరుతున్నట్లు వివరించారు.

'మహాగర్జన'కు సన్నాహకంగా ఈ నెల 13 నుంచి అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే హామీ ఇచ్చిందో అదే ఎల్బీ స్టేడియంలో మహాగర్జన సభ పెట్టి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని అన్నారు. దీంతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికలలో దివ్యాంగులకు రాజకీయంగా అవకాశం కల్పించేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Manda Krishna Madiga
Telangana BJP
Ramchander Rao
Divyangula Pension
MRPS

More Telugu News