AP Government: ఏపీలో దోమల నివారణ కోసం ఏఐ సాయం

AP Government Using AI for Mosquito Control
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో దోమల బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం అధునాతన సాంకేతికతను రంగంలోకి దించుతోంది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే లక్ష్యంతో కృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారిత 'స్మార్ట్ మస్కిటో సర్వైలెన్స్ సిస్టమ్' (SMoSS)ను ప్రారంభించనుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (MAUD) ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ స్మార్ట్ విధానంలో భాగంగా, రాష్ట్రంలోని ఆరు ప్రధాన నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా 66 ప్రాంతాల్లో ఏఐ ఆధారిత సెన్సార్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్మార్ట్ సెన్సార్లు దోమల జాతి, వాటి లింగం, సాంద్రత, ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత, తేమ వంటి వివరాలను నిరంతరం గుర్తిస్తాయి. ఏదైనా ప్రాంతంలో దోమల సాంద్రత నిర్దేశిత స్థాయికి మించితే వెంటనే అధికారులకు హెచ్చరికలు పంపుతాయి. ఈ డేటా మొత్తం ఒక సెంట్రల్ సర్వర్‌కు చేరి, అక్కడి నుంచి అధికారులు రియల్ టైమ్ డాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షిస్తారు.

ఈ విధానం వల్ల ప్రస్తుతం గుడ్డిగా మందులు చల్లే పద్ధతికి స్వస్తి పలికి, కేవలం అవసరమైన చోట మాత్రమే డేటా ఆధారంగా చర్యలు తీసుకుంటారని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో 16, విజయవాడలో 28, కాకినాడలో 4, రాజమహేంద్రవరంలో 5, నెల్లూరులో 7, కర్నూలులో 6 చొప్పున మొత్తం 66 ప్రాంతాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనున్నారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్, డైరెక్టర్ పి. సంపత్ కుమార్ ఇటీవల ఈ టెక్నాలజీ పనితీరును సమీక్షించారు.

లార్వా నివారణ మందులను డ్రోన్ల సహాయంతో పిచికారీ చేయడం వల్ల తక్కువ సమయంలో, తక్కువ రసాయనాలతో ఎక్కువ విస్తీర్ణంలో ప్రభావవంతంగా పనిచేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఈ పనులను ప్రత్యేక ఏజెన్సీలకు ఔట్‌సోర్సింగ్ ద్వారా అప్పగించి, ఫలితాల ఆధారంగానే చెల్లింపులు చేయనున్నారు. అంతేకాకుండా, ఆసుపత్రుల నుంచి డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా కేసుల వివరాలు సేకరించి, వాటి ఆధారంగా హాట్‌స్పాట్‌లను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయనున్నారు.
Go Back to Shorts
AP Government
Andhra Pradesh
Mosquito Control
AI
Artificial Intelligence
Internet of Things
IoT
Smart Mosquito Surveillance System
SMoSS
Dengue

More Telugu News