Naina Sharma: యూపీలో ఘోరం.. ప్రియుడితో కలిసి భర్త, పిల్లల హత్యకు భార్య కుట్ర

Naina Sharma plotted husband children murder in UP
షార్ట్స్‌లో చూడండి
వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ మహిళ తన భర్తను, కన్నబిడ్డలను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. మొదట విషప్రయోగం చేసి, అది ఫలించకపోవడంతో నిద్రిస్తున్న భర్తపై కత్తితో దాడికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

సంభాల్ జిల్లా బహ్జోయ్ ప్రాంతానికి చెందిన గోపాల్ మిశ్రా, నైనా శర్మ దంపతులకు నాలుగేళ్ల చిరాగ్, ఏడాదిన్నర వయసున్న కృష్ణ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే నైనా శర్మ అదే ప్రాంతానికి చెందిన ఆశిష్ మిశ్రాతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్త, పిల్లలను హత్య చేయాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది.

పథకం ప్రకారం జూన్ 30న నైనా పాలలో విషం కలిపి భర్త గోపాల్‌కు, ఇద్దరు పిల్లలకు ఇచ్చింది. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో జూలై 2వ తేదీ అర్ధరాత్రి, ఇంట్లో నిద్రిస్తున్న గోపాల్‌పై నైనా, ఆమె ప్రియుడు ఆశిష్ కత్తితో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన గోపాల్ వారి నుంచి తృటిలో తప్పించుకుని, ఇంటి నుంచి బయటకు పరుగెత్తి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో భయపడిన నైనా, ఆశిష్ ఘటనా స్థలం నుంచి పరారయ్యారు.

అనంతరం గోపాల్ మిశ్రా నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య నైనాకు ఆశిష్‌తో ఉన్న వివాహేతర సంబంధం గురించీ, వారిద్దరూ కలిసి తనను, తన పిల్లలను చంపేందుకు రెండుసార్లు ప్రయత్నించిన తీరును ఫిర్యాదులో వివరించాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న నైనా శర్మ, ఆశిష్ మిశ్రాలను జూలై 4న అరెస్ట్ చేసినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.
Go Back to Shorts
Naina Sharma
Uttar Pradesh
Sambhal district
extra marital affair
murder plot
crime news

More Telugu News