కెప్టెన్ గిల్‌ను ఇంగ్లండ్ టార్గెట్ చేస్తుంది.. హెచ్చరించిన మాజీ క్రికెటర్!

  • కెప్టెన్ గిల్‌ను ఇంగ్లండ్ లక్ష్యంగా చేసుకుంటుందని నిక్ నైట్ వ్యాఖ్య
  • గిల్‌ను త్వరగా ఔట్ చేసి, ఒత్తిడికి గురిచేయాలని ఇంగ్లండ్ చూస్తుందని వెల్లడి
  • విదేశాల్లో గిల్ గణాంకాలు స్వదేశంతో పోలిస్తే తక్కువగా ఉన్నాయని ప్రస్తావన
  • కెప్టెన్‌పై ఒత్తిడి డ్రెస్సింగ్ రూమ్‌పై ప్రభావం చూపుతుందని నైట్ అభిప్రాయం
ఇంగ్లండ్‌తో త్వరలో ప్రారంభం కానున్న కీలక టెస్ట్ సిరీస్‌లో టీమిండియా నూతన కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటుందని ఆ జట్టు మాజీ ఆటగాడు నిక్ నైట్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గానూ, ప్రధాన బ్యాటర్‌గానూ గిల్ ఎలా రాణిస్తాడనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న తరుణంలో నిక్ నైట్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

"ప్రతి జట్టుకూ ప్రత్యర్థి కెప్టెన్‌ను ఒత్తిడిలోకి నెట్టడం చాలా ముఖ్యం. ఇంగ్లండ్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తుందని నేను భావిస్తున్నాను. కెప్టెన్ కనుక కాస్త ఇబ్బంది పడితే, ఆ ప్రభావం సహజంగానే డ్రెస్సింగ్ రూమ్‌పై పడుతుంది. అందుకే, శుభ్‌మన్‌ గిల్‌ను టార్గెట్ చేసి, అతడిని వీలైనంత త్వరగా పెవిలియన్‌కు పంపాలని, తద్వారా అతడిని అసౌకర్యానికి గురిచేయాలని ఇంగ్లండ్ జట్టు ప్రయత్నిస్తుంది" అని నిక్ నైట్ పేర్కొన్నాడు.

స్వదేశంలో గిల్ అద్భుతంగా రాణించినప్పటికీ, విదేశీ గడ్డపై అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. విదేశాల్లో ఇప్పటివరకు ఆడిన 15 టెస్టు మ్యాచ్‌లలో గిల్ 27.53 సగటుతో 716 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక సెంచరీ ఉంది. అదే సొంత‌ గడ్డపై ఆడిన 17 మ్యాచ్‌లలో 42 సగటుతో 1,177 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు శ‌త‌కాలు ఉన్నాయి. ఈ గణాంకాల నేపథ్యంలోనే ఇంగ్లండ్ జట్టు గిల్‌ను లక్ష్యంగా చేసుకోవచ్చని నైట్ అంచనా వేశాడు.

అయితే, గిల్ ప్రతిభను కొనియాడుతూ "శుభ్‌మన్‌కు ఇది చాలా పెద్ద సిరీస్ కాబోతోంది. నేను అతనికి పెద్ద అభిమానిని. అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్నప్పటి నుంచే అతని ఆటను గమనిస్తున్నాను. అప్పట్లోనే తను అంతర్జాతీయ స్థాయిలో గొప్ప ఆటగాడు అవుతాడని నేను ఊహించాను" అని నిక్ నైట్ ప్రశంసించాడు. అదే సమయంలో గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లు ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించి అతడిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయ‌ప‌డ్డాడు.

కాగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. సిరీస్‌లోని తొలి టెస్టు మ్యాచ్ లీడ్స్ మైదానం వేదికగా జరగనుంది. ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ఈ రెండు అగ్రశ్రేణి జట్లకు ఇదే మొదటి సిరీస్ కావడం విశేషం.


More Telugu News